బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)కు హోస్ట్గా వ్యవహరిస్తున్న భారత్కు చెందిన రిధిమా పాఠక్ హోస్టింగ్ ప్యానల్ నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. భారత్కు చెందిన వ్యక్తి కావడంతోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీసీఐ) ఆమెను తొలిగించిందని వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రచారాన్ని రిధిమా పాఠక్ ఖండించింది. ఇందులో వాస్తవం లేదని, తనను ఎవరూ తప్పించలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తానే తప్పుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది.
'బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ హోస్ట్ ప్యానల్ నుంచి నన్ను తొలగించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వాటిలో నిజం లేదు. బీపీఎల్ నుంచి వైదొలగాలని నేను వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నాం. నాకు దేశమే ముఖ్యం. తర్వాతే ఏదైనా. నిజాయితీ, గౌరవం, ఇంట్రెస్ట్తో కొన్నేళ్ల పాటు క్రికెట్కు సేవ చేసే అవకాశం నాకు లభించింది. నాకు మద్దతుగా నిలిచి ప్రతీ ఒక్కరికి ధన్యావాలు.'అని ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు.

ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అక్కడి హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను ఐపీఎల్కు ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అతన్ని వెంటనే జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వ్యక్తమయ్యాయి. దాంతో బీసీసీఐ అతన్ని రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని ఆదేశించింది. దాంతో కేకేఆర్ అతన్ని విడుదల చేసింది.
ముస్తాఫిజుర్ను తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలోతమ జట్టు భారత్లో పర్యటించడం సురక్షితం కాదని, తమ మ్యాచ్లను మరో చోట నిర్వహించాలని ఐసీసీని బీసీబీ కోరింది. ఈ క్రమంలోనే రిధిమా పాఠక్ను కూడా హోస్టింగ్ ప్యానెల్ నుంచి తప్పించారనే ప్రచారం జరిగింది. కానీ తానే తప్పుకున్నానని ఆమె స్పష్టం చేసింది.