ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా బుధవారం నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్లో ఆతిథ్య ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉండనున్నాడు. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ సిరీస్లో బుమ్రా మూడు మ్యాచ్లే ఆడుతాడని టీమిండియా మేనేజ్మెంట్ ఇప్పటికే తెలియజేసింది.
ఈ క్రమంలోనే తొలి టెస్ట్ ఆడిన బుమ్రా.. రెండో టెస్ట్కు దూరంగా ఉంటాడని వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో అర్ష్దీప్ సింగ్ బరిలోకి దిగుతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే బుమ్రా దూరమైతే అతని స్థానంలో అర్ష్దీప్ సింగ్ బదులు.. మహమ్మద్ షమీ తరహా బౌలర్ అయిన ఆకాశ్ దీప్ను తీసుకోవాలని టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్.. పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.

'ఒకవేళ బుమ్రా అందుబాటులో లేకపోతే.. అతని స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారు? నెట్స్లో ఆకాశ్ దీప్ను చూస్తుంటే అతను రిథమ్లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆకాశ్ దీప్ బౌలింగ్ చూసినప్పుడల్లా నాకు షమీ గుర్తొస్తాడు. అతను షమీ తరహా బౌలర్. ఆకాశ్ దీప్ స్ట్రైట్ సీమ్ డెలివరీలు ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతాయి. ముఖ్యంగా అతని లేట్ మూవ్మెంట్ బాల్స్ ఆడలేరు. ఇంగ్లండ్ బ్యాటర్లు దూకుడుగా ఆడాలనుకున్నప్పుడు ఆకాశ్ దీప్ మరింత ప్రమాదకరంగా మారుతాడు. జస్ప్రీత్ బుమ్రా ఆడకపోతే అతని స్థానంలో అర్ష్దీప్ సింగ్కు బదులు ఆకాశ్దీప్ను ఆడించాలి'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.
ఎడ్జ్బాస్టన్ పిచ్ రికార్డ్ కూడా పేస్కు అనుకూలంగా ఉండనుంది. తొలి మూడు రోజులు పేసర్లకు సహకరిస్తోంది. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారుతుంది. ఆఖరి రోజు పిచ్పై పగుళ్లు ఏర్పడితే స్పిన్కు సహకరిస్తోంది. భారత్ తుది జట్టులో మూడు మార్పులు చేసే అవకాశం ఉంది. పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని ఆడించనుండగా.. జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగవచ్చు.