న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. నాగ్పూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన టీమిండియా 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. సిక్సర్ల వర్షం కురిసిన ఈ హైస్కోర్ గేమ్లో అభిషేక్ శర్మ, రింకూ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్తో న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు.
బౌలింగ్లో వరుణ్ చక్రవర్తీ, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ న్యూజిలాండ్ను దెబ్బతీసారు. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో టీమిండియాకు గెలుపు బాట వేసినా.. రింకూ సింగ్ అద్భుతమైన ఫినిషింగ్ టీమిండియాను గెలిపించిందని నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సుదీర్ఘ విరామం తర్వాత భారత తుది జట్టులోకి వచ్చిన రింకూ సింగ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతను జట్టుకు అద్భుతమైన ముగింపును అందించాడు. చివర్లో అతను చేసిన 44 పరుగులు టీమిండియాకు విజయాన్నందించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతనే విఫలమై ఉంటే టీమిండియా స్కోర్ 200 లోపే పరిమితమయ్యేదని, అప్పుడు న్యూజిలాండ్ ఈజీగా లక్ష్యాన్ని అందుకునేదని విశ్లేషిస్తున్నారు.
238 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేయడంతోనే ఒత్తిడికి గురైన కివీస్ బ్యాటర్లు వికెట్ పారేసుకున్నారని వివరణ ఇస్తున్నారు. మ్యాచ్ విన్నర్ రింకూ సింగ్ అని కొనియాడుతున్నారు. రింకూ సింగ్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో రెండు సిక్స్లు, రెండు ఫోర్లతో 21 పరుగులు పిండుకొని మ్యాచ్ మూమెంటమ్ను భారత్ వైపు తిప్పాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్తో 84) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 32), రింకూ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫీ(2/27), కైల్ జెమీసన్(2/54) రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్టియన్ క్లార్క్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.
అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులే చేసి ఓటమిపాలైంది. గ్లేన్ ఫిలిప్స్(40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 78) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/37), శివమ్ దూబే(2/28) రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టీ20 శుక్రవారం రాయ్పూర్ వేదికగా జరగనుంది.