
స్టావెంజర్: నార్వే ఓపెన్ క్లాసికల్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అగ్రస్థానం కోల్పోయాడు. నెదర్లాండ్స్ గ్రాండ్మాస్టర్ అనీష్ గిరితో మంగళవారం జరిగిన ఆరో రౌండ్ను ఆనంద్ డ్రా చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య మొదట జరిగిన క్లాసికల్ పోరు 35 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. ఆ తర్వా త ఫలితం కోసం ఆర్మ గెడాన్ గేమ్లో కూడా ఫలితం తేలలేదు. దాంతో 11.5 పాయింట్లతో అనీష్తో కలిసి విశ్వనాథన్ ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఆరు గేమ్లు ఆడిన ఆనంద్కు ఇదే తొలి డ్రా.
అతడు నాలుగు గేముల్లో నెగ్గి.. ఒక గేమ్లో ఓడాడు. అయిదో గేమ్లో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)ను ఆనంద్ ఓడించిన సంగతి తెలిసిందే. మరోవైపు అయిదో గేమ్లో విషీ చేతిలో ఓటమి ఎదురైనా కార్ల్సన్ (12.5) పుంజుకున్నాడు. ఆరో గేమ్లో విజయంతో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. ఆరో గేమ్లో తైముర్ రద్జబోవ్ (అజర్బైజాన్)పై మాగ్నస్ 56 ఎత్తుల్లో విజయం సాధించాడు.
సోమవారం జరిగిన ఐదో రౌండ్లో ఆనంద్.. వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్(నార్వే)ను ఓడించాడు. వారం రోజుల వ్యవధిలో కార్ల్సన్పై ఆనంద్కిది రెండో గెలుపు కావడం విశేషం. ఇదే వేదికపై జరిగిన బ్లిట్జ్ కేటగిరీ టోర్నీలోనూ కార్ల్సన్పై ఆనంద్ విజయం సాధించాడు.
క్లాసికల్ టోర్నీలో 31 ఏళ్ల కార్ల్సన్తో జరిగిన ఐదో రౌండ్ గేమ్ను తెల్లపావులతో ఆడిన 52 ఏళ్ల ఆనంద్ 40 ఎత్తుల్లో 'డ్రా' చేసుకున్నాడు. అయితే ఈ టోర్నీ నిబంధనల ప్రకారం 'డ్రా' అయిన గేమ్లో ఫలితం వచ్చేందుకు ప్రత్యేకంగా 'అర్మగెడాన్' గేమ్ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ 'అర్మగెడాన్' గేమ్ నిబంధనల ప్రకారం తెల్ల పావులతో ఆడే ప్లేయర్కు 10 నిమిషాలు, నల్ల పావులతో ఆడే ప్లేయర్కు 7 నిమిషాలు కేటాయిస్తారు. తెల్ల పావులతో ఆడుతున్న ప్లేయర్ గెలిస్తేనే అతనికి విజయం ఖరారవుతుంది. ఒకవేళ గేమ్ 'డ్రా' అయితే మాత్రం తక్కువ సమయం పొందినందుకుగాను నల్ల పావులతో ఆడిన ప్లేయర్ను గెలిచినట్లు ప్రకటిస్తారు.