బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ ప్రపంచకప్ గెలిస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని, అప్పటి వరకు ఒంటరిగానే ఉంటానని ఓ అభిమాని ప్లకార్డ్ ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్.. ఆ జట్టుతో మూడు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం సాధించగా.. షార్జా వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో యూఏఈ గెలుపొందింది. ఈ మ్యాచ్కు హాజరైన ఓ బంగ్లాదేశ్ అభిమాని.. తమ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా ఓ ప్లకార్డ్ ప్రదర్శించాడు.
దానిపై 'బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్ గెలిస్తేనే పెళ్లి చేసుకుంటాను'అని రాసి ఉంది. టీవీ కెమెరాలు అతన్ని చూపించడంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. బంగ్లాదేశ్ తమ చరిత్రలోనే ఇప్పటి వరకు ఓ ముక్కోణపు సిరీస్ కూడా గెలవలేదు. ఆసియా కప్తో సహా ప్రధాని టోర్నీల్లో ఒక్కదాంట్లో విజయం సాధించలేదు. అలాంటి జట్టు ప్రపంచకప్ ఎలా గెలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్ ప్రపంచకప్ గెలిచే వరకు పెళ్లి చేసుకోనంటే.. జీవితంలో పెళ్లి కాదని హెచ్చరిస్తున్నారు. 2026 టీ20 ప్రపంచకప్, 2027 వన్డే ప్రపంచకప్ వరకు వేచి చూసి పెళ్లి చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. ఈ మ్యాచ్ కామెంటేటర్ కూడా సదరు అభిమానికి ఇదే సలహా ఇచ్చాడు. ఆ అభిమాని దరిద్రమో ఏమో కానీ.. అతను ప్లకార్డ్ ప్రదర్శించిన మ్యాచ్లోనే బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. టీ20 చరిత్రలోనే బంగ్లాదేశ్ను యూఏఈ తొలిసారి ఓడించింది.
ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. తాంజిద్ హసన్(59) హాఫ్ సెంచరీతో రాణించగా.. లిటన్ దాస్(40), టౌహిడ్ హృదయ్(45) దూకుడుగా ఆడారు. అనంతరం యూఏఈ 19.5 ఓవర్లలో 8 వికెట్లకు 206 పరుగులు చేసి గెలుపొందింది. ఆ జట్టు కెప్టెన్ ముహమ్మద్ వసీమ్(42 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 82) విజయంలో కీలక పాత్ర పోషించాడు.