మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. తొలి ప్రపంచకప్ను ముద్దాడింది. 2005, 2017లో తృటిలో చేజారిన కప్ను ఈ సారి ఏ తప్పిదం చేయకుండా ఒడిసి పట్టుకుంది. ఫైనల్ ఒత్తిడిని చిరునవ్వుతో ఛేదిస్తూ తొలిసారి ఫైనల్ చేరిన సౌతాఫ్రికాను మట్టికరిపించింది. 1983 ప్రపంచకప్ విజయం భారత్లో క్రికెట్ క్రేజ్ను పెంచితే.. అమ్మాయిల తాజా విజయం మగువల క్రికెట్కు ఆదరణ పెంచనుంది.
చిరస్మరణీయ విజయం సాధించిన భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఉంటుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి విజయోత్సవ వేడుకలు నిర్వహించలేదు. ఆటగాళ్లంతా తమ స్వస్థలాలకు కూడా వెళ్లిపోయారు. ధోనీ, రోహిత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు నిర్వహించిన ఓపెన్ బస్ పరేడ్ తరహాలో అమ్మాయిల విజయాన్ని కూడా బీసీసీఐ సెలెబ్రేట్ చేస్తుందని అంతా భావించారు. కానీ బీసీసీఐ అలాంటి ఏర్పాట్లు ఏం చేయలేదు. దాంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలకు ఒక న్యాయమా? పురుష క్రికెటర్ల ఒక న్యాయమా? అని మండిపడుతున్నారు.

దుబాయ్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ.. ప్రపంచకప్ విజయోత్సవ వేడుకలను నిర్వహించడంలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి విజయోత్స వేడుకలు ప్లాన్ చేయలేదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ను ప్రత్యక్షంగా వీక్షించిన సైకియా.. ట్రోఫీ ప్రదానోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఐసీసీ సమావేశం నేపథ్యంలో ఆయన సోమవారమే దుబాయ్కి వెళ్లారు. ఆయనతో పాటు బీసీసీఐ కీలక అధికారులు కూడా ఐసీసీ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ ఐసీసీ సమావేశంలో బీసీసీఐ.. ఆసియా కప్ ఉదంతాన్ని ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీసీ ప్రెసిడెంట్గా మోహ్సిన్ నఖ్వీ ప్రవర్తించిన తీరుపై తమ గళాన్ని విప్పనుంది. ఇప్పటి వరకు ఆసియా కప్ ట్రోఫీ అందించకపోవడంపై తమ అసంతృప్తి వ్యక్తం చేయనుంది. ఆసియా కప్ ట్రోఫీని నఖ్వీ చేతుల మీదుగా భారత్ స్వీకరించని సంగతి తెలిసిందే. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఐసీసీని ఇప్పటికే బీసీసీఐ పలుమార్లు కోరింది. ఈ కీలమైన మీటింగ్ కోసమే బీసీసీఐ.. మహిళల విజయోత్స వేడుకలు నిర్వహించలేదని అర్థమవుతుంది.
అంతేకాకుండా ఐపీఎల్ 2025 సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు విషాదంగా మారడంతో సెలెబ్రేషన్స్ పట్ల బీసీసీఐ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. చిన్నస్వామి స్టేడియం ముంగిట జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో విజయోత్సవ వేడుకల విషయంలో బీసీసీఐ కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. అభిమానుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకొని వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది.
విజయోత్స వేడుకలు లేకపోయినా.. దేశ ప్రధాని నరేంద్ర మోదీని భారత మహిళల జట్టు కలిసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి బీసీసీఐకి అధికారిక ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.