
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాత జట్ల రిటెన్షన్, కొత్త టీమ్లు ఆటగాళ్ల ఎంపికతోపాటు వేలం కోసం రిజిష్ట్రేషన్ కూడా పూర్తి అయిపోయింది. మెగా వేలానికి మొత్తం 1214 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. అందులో నుంచి బీసీసీఐ 590 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేసింది.
ఇందులో 228 మంది క్యాప్డ్ (జాతీయ జట్లకు ఎంపికైన వారు), 355 మంది అన్క్యాప్డ్ (జాతీయ టీమ్కు ఎంపిక కానివారు), ఏడుగురు అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఈ షార్ట్ లిస్ట్లో 370 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 220 మంద ఓవర్సీస్ ఆటగాళ్లున్నారు. లీగ్లోకి కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు వచ్చి చేరడంతో 2011 తర్వాత మళ్లీ 10 జట్లు వేలంలో పాల్గొననున్నాయి.
ఇక మెగా ఆక్షన్లో పాల్గొనే తమ ప్రతినిధుల వివరాలను వెల్లడించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పది ఫ్రాంచైజీలను ఆదేశించింది. ఫిబ్రవరి 4లోపు ఈ జాబితాను అందజేయాలని ఒక్కో టీమ్ గరిష్టంగా 10 మందిని, కనిష్టంగా 8 మందిని మాత్రమే తీసుకురావాలని తెలిపింది.
క్రిక్బజ్ కథనం మేరకు మెగా వేలంలో పాల్గొనే ప్రతినిధులకు క్వారంటైన్ అవసరం లేదని తెలుస్తోంది. విదేశీయులు కూడా ప్రత్యేకంగా క్వారంటైన్లో ఉండాల్సిన పనిలేదని, కాకాపోతే రెండు ఆర్టీపీసీఆర్ టెస్ట్ల్లో నెగటీవ్ రావాలి. మెగా ఆక్షన్కు 72 గంటల ముందే ఈ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. ఈ రిపోర్ట్లన్నీ మెడికల్ టీమ్కు అందజేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా విదేశీ ప్రతినిధులు భారత ప్రభుత్వ నిబంధనల మేరకు ఏడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకోని ఉండాలి. నేరుగా వచ్చేవారికి అనుమతి లేదు. 8, 9వ రోజు నిర్వహించే ఆర్టీపీసీఆర్ టెస్ట్ల్లో నెగటీవ్ రావాలి. ఇక మెగా వేలం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.