ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న తమ ఆఖరి సూపర్-8 పోరులో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, డ్యూ ఫ్యాక్టర్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పిన సూర్య.. విన్నింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నామని పేర్కొన్నాడు. గత మ్యాచ్ తరహాలోనే మూడు విభాగాల్లో రాణించాలనుకుంటున్నామని స్పష్టం చేశాడు.
తమ డ్రెస్సింగ్ రూమ్లో కాస్త ఒత్తిడి ఉన్న మాట వాస్తవేమనని, అది లేకపోతే ఆటలో మజా ఉండదని చెప్పాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ పిచ్ బాగుంది. ఈడెన్ గార్డెన్స్ ఛేజింగ్కు అనుకూలించే గ్రౌండ్. రెండో ఇన్నింగ్స్లో వికెట్ బ్యాటింగ్కు బాగా సహకరిస్తుంది. పైగా మంచు ప్రభావం కూడా ఉండొచ్చు. స్టేడియంలో వాతావరణం అద్భుతంగా ఉంది. డ్రెస్సింగ్ రూమ్లో కొంచెం ఒత్తిడి, ఆందోళన ఉన్నా.. అది లేకపోతే ఆటలో మజా ఉండదు. గత మ్యాచ్లో మేము అన్ని విభాగాల్లో రాణించాం. అదే సానుకూలతతో ఈ మ్యాచ్లోనూ ఆడతాం.'అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని వెస్టిండీస్ టీ20 కెప్టెన్ షై హోప్ తెలిపాడు. 'మేం టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. మాకు నిలకడగా ఆడటం చాలా ముఖ్యం. మా ఆటగాళ్లలో చాలామందికి ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. ఈ రోజు మేం విజయం సాధిస్తామని ఆశిస్తున్నాను. ఇది మాకు 'డూ ఆర్ డై' మ్యాచ్. ఇలాంటి పెద్ద జట్లపై ఆడటానికే మేం ఇష్టపడతాం.'అని షై హోప్ పేర్కొన్నాడు. విండీస్ తుది జట్టులో ఒక మార్పు జరిగింది. బ్రాండన్ కింగ్ స్థానంలో అకీల్ హోసేన్ జట్టులోకి వచ్చాడు. ఇరు జట్లకు ఇది క్వార్టర్ ఫైనల్లాంటిది. గెలిచిన జట్టు సెమీఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.
భారత జట్టు:
సంజు శామ్సన్ (కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
వెస్టిండీస్ జట్టు:
షాయ్ హోప్ (కెప్టెన్/కీపర్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హోసేన్, గుడకేష్ మోటీ, షామర్ జోసెఫ్.