ఆసియా కప్ 2025 ఎంపిక చేసిన భారత జట్టుపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. ఈ జట్టుతో ఆసియా కప్ గెలిచినా.. టీ20 ప్రపంచకప్ 2026 మాత్రం గెలవలేరని స్పష్టం చేశాడు. అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడాన్ని శ్రీకాంత్ తప్పుబట్టాడు. ఆసియా కప్ 2025 కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.
శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్కు అవకాశం దక్కలేదు. ఏడాది తర్వాత భారత టీ20 జట్టులోకి వచ్చిన శుభ్మన్ గిల్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. టీమ్ సెలెక్షన్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్కు అవకాశం ఇవ్వకపోవడాన్ని చాలా మంది విశ్లేషకులు తప్పుబట్టారు. తాజాగా టీమ్ సెలెక్షన్పై యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించిన శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

'ఈ జట్టుతో మనం ఆసియా కప్ గెలవచ్చు ఏమో కానీ టీ20 ప్రపంచకప్ అయితే గెలవలేం. ఈ జట్టునే వరల్డ్ కప్లో ఆడించాలనుకుంటున్నారా? మరో 6 నెలల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం ఇలానేనా సన్నదయ్యేది? వారు(సెలెక్టర్లు) జట్టును తిరోగమన దిశగా తీసుకెళ్లారు. వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి అక్షర్ పటేల్ను తప్పించారు. అసలు రింకూ సింగ్, శివమ్ దూబే, హర్షిత్ రాణాలను ఎలా ఎంపిక చేశారో అర్థం కావడం లేదు. జట్టు ఎంపికకు ఐపీఎల్ ప్రదర్శనలను ప్రామాణికంగా తీసుకోవాల్సింది. కానీ వారు అంతుకుముందు ఆటను పరిగణలోకి తీసుకున్నట్లున్నారు.
ఐదో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారు? సంజూ శాంసన్, జితేష్ శర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ల్లో ఎవరు ఆడుతారు? అక్షర్ పటేల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయలేడు. అసలు యశస్వి జైస్వాల్ను కాదని శివమ్ దూబే ఎందుకు ఎంపిక చేశారో అర్థం కావడం లేదు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. అతన్ని ఎలా పక్కన పెడతారు?'అని శ్రీకాంత్ ప్రశ్నించాడు. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే తొలి మ్యాచ్తో భారత్ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్తో హై ఓల్టేజ్ మ్యాచ్ ఆడనుంది.