భారత 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఆల్టైమ్ ఎలెవన్ ప్రకటించాడు. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాళ్లతో ఈ జట్టును ఎంపిక చేశాడు. ఈ భారత ఆల్టైమ్ ఎలెవన్లో ఈ తరం అత్యుత్తమ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్, జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు.
దిగ్గజ ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్లు కూడా ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్కు రెండు ప్రపంచకప్లు అందించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈ ఆల్టైమ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. 14 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ధోనీ మూడు ఫార్మాట్లలో కలిపి 15000 ప్లస్ రన్స్ చేశాడు.

అతని సారథ్యంలోనే భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్తో పాటు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. దినేశ్ కార్తీక్ తన ఆల్టైమ్ ప్లేయింగ్ ఎలెవన్లో కార్తీక్.. ఐదుగురు బ్యాటర్లతో పాటు ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లను తీసుకున్నాడు. మరో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో పాటు ఇద్దరు పేసర్లకు అవకాశం ఇచ్చాడు.
రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్లను ఓపెనర్లుగా ఎంపిక చేసిన దినేష్ కార్తీక్.. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్లను మిడిలార్డర్ బ్యాటర్లుగా తీసుకున్నాడు. యువీతో పాటు మరో స్పిన్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజాను ఎంపిక చేసిన కార్తీక్.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా అశ్విన్, కుంబ్లేలను ఎంచుకున్నాడు. బుమ్రాతో పాటు జహీర్ ఖాన్లను ఆల్టైమ్ భారత పేసర్లుగా పేర్కొన్నాడు.
ఈ ఆల్టైమ్ ఎలెవన్ 12వ ఆటగాడు హర్భజన్ సింగ్ పేరు చెప్పిన కార్తీక్.. తాను చాలా మంది ఆటగాళ్ల పేర్లను విస్మరించానని తెలిపాడు. గౌతమ్ గంభీర్ సైతం ఈ జట్టులో ఫిట్ అయ్యే ప్లేయరని అభిప్రాయపడ్డాడు.
దినేశ్ కార్తీక్ ఇండియా ఆల్టైమ్ ఎలెవన్:
వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్.
12వ ఆటగాడు: హర్భజన్ సింగ్