ముంబై: బ్యాటింగ్లో 20 పరుగులు తక్కువగా చేయడంతో పాటు పవర్ ప్లేలోనే ధారళంగా పరుగులిచ్చుకోవడం తమ ఓటమిని శాసించిందని కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణా అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఐదు వికెట్లతో ఓటమిపాలైంది. 15 ఏళ్ల తర్వాత కేకేఆర్ తరఫున వెంకటేశ్ అయ్యర్ సెంచరీ బాదినా విజయాన్ని అందుకోలేకపోయింది.
మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన నితీశ్ రాణా.. వెంకటేశ్ అయ్యర్ సెంచరీ చేసిన తర్వాత కూడా గెలవకపోవడం బాధగా ఉందన్నాడు. 'ఈ మ్యాచ్లో మేం 15-20 పరుగులు తక్కువగా చేశాం. ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా అద్భుతంగా బౌలింగ్ చేసి మమ్మల్ని కట్టడి చేశాడు. వెంకటేశ్ అయ్యర్ సెంచరీ చేసిన తర్వాత కూడా ఓడిపోవడం బాధగా ఉంది.

వెంకీ చేసిన చేసిన శతకం కేకేఆర్ తరఫున రెండో సెంచరీ అనే విషయం జట్టులో ఉన్న అందరికీ తెలుసు. భవిష్యత్తులో మా ప్లేయర్లు మరిన్ని సెంచరీలు బాదుతారు. టోర్నీ జరుగుతున్నా కొద్దీ ఈ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ముంబై బ్యాటర్లు మా అత్యుత్తమ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పవర్ ప్లేలో మేం మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సింది.
మా బౌలింగ్ విభాగం మరింత మెరుగ్గా రాణిస్తుందని ఆశించాను. ప్రతీ ఒక్కరికి బ్యాడ్ డే ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్లో మా తప్పిదాలపై చర్చిస్తాం. మెరుగవ్వడంపై ఫోకస్ పెడుతాం.'అని నితీశ్ రాణా చెప్పుకొచ్చాడు.
మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్లతో 104) సెంచరీతో చెలరేగగా.. ఆండ్రీ రస్సెల్ (11 బంతుల్లో 3 ఫోర్లు వికెట్తో 21 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ రెండు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్, డాన్ జాన్సెన్, పియూష్ చావ్లా, రీలే మెరిడిత్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఇషాన్ కిషన్(25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 43), తిలక్ వర్మ(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 30) విలువైన పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో సుయాశ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. లూకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.