ఆస్ట్రేలియా గడ్డపై అసాధారణ సెంచరీతో టీమిండియాను ఆదుకున్న యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసాధారణ శతకంతో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచిన నితీష్ కుమార్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంటే అతను మాత్రం తన ఆట తనకే నచ్చడం లేదని చెప్పాడు. తాను ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
తన బ్యాటింగ్ విషయంలో సంతోషంగా ఉన్నా.. బౌలింగ్లో ఎంతో మెరుగవ్వాల్సిన అవసరం ఉందని అంగీకరించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన బౌలింగ్ గొప్పగా లేదని చెప్పాడు. టీమిండియా గొప్ప ఆల్రౌండర్గా ఎదగడమే తన లక్ష్యమని, బౌలింగ్ను మెరుగుపర్చుకునేందుకు మరింత కష్టపడుతానని వెల్లడించాడు.

బౌలింగ్ బాలేదు..
నాలుగో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన నితీష్ కుమార్ రెడ్డి.. బ్యాటింగ్లో రాణిస్తున్నా.. బౌలింగ్ అంచనాలను అందుకోలేకపోయానని తెలిపాడు. 'బ్యాటింగ్ విషయంలో సంతోషంగా ఉన్నా.. బౌలింగ్లో మాత్రం రాణించలేకపోయాను. అంచనాలను అందుకోలేకపోయాను. టీమిండియా ఆల్రౌండర్గా ఎదగడమే నా డ్రీమ్. బౌలింగ్ను మెరుగుపర్చుకోవడంపై ఫోకస్ పెడ్తాను. భారత జట్టులో ఖాళీగా ఉన్న పేస్ ఆల్రౌండర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు మరింత కష్టపడుతాను.
విరాట్ కోహ్లీ నా ఆరాధ్య క్రికెటర్. అతనితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవడం ఓ డ్రీమ్లా ఉంది. అతనే నాకు రోల్ మోడల్. కోహ్లీని చిన్నప్పటి నుంచి ఆరాదిస్తూ పెరిగాను. అతనితో కలిసి ఆడేందుకు నా వయసును లెక్కించుకునేవాడిని. నేను టీమిండియాలోకి వచ్చే వరకు విరాట్ కోహ్లీ రిటైర్ అవ్వద్దని బలంగా కోరుకునేవాడిని. మొత్తానికి కోహ్లీ కలిసి ఆడుతున్నాను.

అతను కఠిన బౌలర్..
ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నాను. మొత్తానికి అనుకున్నది సాధించాను. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ కఠినమైన బౌలర్. నిలకడగా ఒకే లైన్ అండ్ లెంగ్త్లో బాల్స్ వేస్తాడు.'అని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.
221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును నితీష్(189 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 114) సంచలన బ్యాటింగ్తో ఆదుకున్నాడు. వాషింగ్టన్ సుందర్(160 బంతుల్లో ఒక్క ఫోర్తో 50) కలిసి 8వ వికెట్కు 127 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సుందర్, జస్ప్రీత్ బుమ్రా ఔటైనా.. సిరాజ్ సాయంతో సెంచరీ మార్క్ అందుకొని తన కలను సాకారం చేసుకున్నాడు.
డ్రా దిశగా మ్యాచ్..
ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. 340 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. టీ బ్రేక్ సమయానికి 54 ఓవర్లలో 3 వికెట్లకు 112 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(9), విరాట్ కోహ్లీ(5), కేఎల్ రాహుల్(0) విఫలమైనా.. యశస్వి జైస్వాల్(63 బ్యాటింగ్), రిషభ్ పంత్(28 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 474 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. 105 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 234 పరుగులకు ఆలౌటైంది.