టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై తెలుగు తేజం, యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించాడు. తన ఆటతో భారత క్రికెట్ శైలిని విరాట్ కోహ్లీ పూర్తిగా మార్చేశాడని కొనియాడాడు. క్రికెట్లో విరాట్ కోహ్లీనే తన ఆరాధ్య దైవమని, చిన్నప్పటి నుంచి అతని బ్యాటింగ్ చూస్తూ పెరిగానని తెలిపాడు.
ప్రస్తుతం నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్నాడు. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్తోనే నితీష్ కుమార్ రెడ్డి సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేయనున్నాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆంధ్ర ఆల్రౌండర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

కోహ్లీ డైహార్డ్ ఫ్యాన్ ఇక్కడ..
ఈ ఇంటర్వ్యూలో అభిమాన క్రికెటర్ ఎవరా? అని ప్రశ్నించగా నితీష్.. విరాట్ కోహ్లీ పేరు చెప్పాడు. 'విరాట్ కోహ్లీ నా ఆరాధ్య దైవం. చిన్నప్పటి నుంచి అతని ఆటను చూస్తూ పెరిగాను. విరాట్ కోహ్లీ స్టైల్ చూసి బ్యాటింగ్ నేర్చుకున్నాను. అతడి గేమ్ ప్లే, ఆటిట్యూడ్ నాకెంతో ఇష్టం. భారత క్రికెట్ శైలిని అతను పూర్తిగా మార్చేశాడు. కోహ్లీలోని ప్రతీ క్వాలిటీని నేను అభిమానిస్తాను. ఫుట్బాల్లో క్రిస్టియన్ రోనాల్డో అంటే ఇష్టం.
నా అల్టిమేట్ గోల్ వరల్డ్ బెస్ట్ ఆల్రౌండర్గా ఎదగడం. బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, కపిల్ దేవ్లా గొప్ప ఆల్రౌండర్గా ఎదిగేందుకు కష్టపడుతున్నాను.
ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాను. జట్టు కోసం నా వంతు 100 శాతం కష్టపడుతాను. ఆల్రౌండర్గా బీసీసీఐ నన్ను ఎంచుకుంది. కాబట్టి నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తిస్తాను.
డ్రింక్స్ మోసేందుకు రెడీ..
ఆల్రౌండర్గా బౌలింగ్, బ్యాటింగ్లో 110 శాతం రాణించేందుకు ప్రయత్నిస్తాను. నేను ఫీల్డింగ్ కూడా బాగా చేయగలను. తుది జట్టులో నాకు చోటు దక్కకపోతే.. 12వ ఆటగాడిగా డ్రింక్స్ అందించేందుకు కూడా సిద్దంగా ఉన్నాను. సబ్స్టిట్యూట్గా గొప్ప క్యాచ్లు అందుకోగలను. నాకు అవకాశం ఇస్తే మాత్రం నా సాయశక్తులా బ్యాటింగ్, బౌలింగ్లో రాణిస్తాను. భారత్కు ఇది కీలకమైన సిరీస్. నాకు కూడా చాలా ముఖ్యమైనది.
భారత్-ఏ తరఫున ఆడటంతో ఇక్కడి పరిస్థితులు తెలిసొచ్చాయి. ఎస్జీ, కూకబుర్రా బంతుల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎస్జీ బాల్స్లో ఒకవైపు గరుకుగా ఉంటుంది. బంతి షైన్, రఫ్ను ఉపయోగించడం సులువు. కూకబుర్రాలో మాత్రం అలా కాదు. బంతి త్వరగా పాత బడదు. పిచ్ వల్లనో లేక ఔట్ ఫీల్డ్ వల్లనో నాకు తెలియదు కానీ.. బంతి కఠినంగా ఉంటుంది. ఆరంభంలో కాకుండా మధ్యలో ఎక్కువ స్వింగ్ను రాబట్టలేం.
స్వింగ్ రాబట్టలేం..
బౌలింగ్ మార్పులు చేసినప్పుడు కూడా స్వింగ్ లభించదు. ఆఫ్ ది పిచ్ కదిలికను బట్టి బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బౌన్స్ను నమ్ముకొని బౌలింగ్ చేయాలి.'అని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు. తొలి టెస్ట్లోనే నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కనుంది. అతన్ని తుది జట్టులోకి తీసుకుంటే చాలా ఆప్షన్స్ లభిస్తాయని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పాడు. ఈ వ్యాఖ్యలు అతని అరంగేట్రానికి సంబంధించిన వార్తలకు బలం చేకూర్చుతోంది.