వరల్డ్ బెస్ట్ ఆల్రౌండర్గా ఎదగాలన్నదే తన జీవిత లక్ష్యమని టీమిండియా యువ ప్లేయర్, తెలుగు తేజం నితీశ్కుమార్ రెడ్డి అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ మెగా వేలం గురించి ఆలోచించడం లేదని, ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటడంపైనే ఫోకస్ పెట్టానని స్పష్టం చేశాడు.
అసాధారణ ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డి.. ఇటీవలే టెస్ట్ టీమ్ పిలుపు అందుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి నితీష్ కుమార్ రెడ్డిని భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు.

ఐపీఎల్తో దూసుకొచ్చి..
ఐపీఎల్ 2024 సీజన్లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డి.. అప్పటి నుంచి అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున 303 పరుగులు, 3 వికెట్లతో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ అందుకున్నాడు. బంగ్లాదేశ్తో రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 21 ఏళ్ల నితీశ్.. 74 పరుగులు, 2 వికెట్లతో సత్తా చాటాడు.
గురువారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే సిరీస్లో భారత్-ఏ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ పర్యటన నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన నితీష్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నాకు కలిసొచ్చిన ఏడాది..
'ఆస్ట్రేలియాతో ఆడే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆడనుండటం గౌరవంగా భావిస్తున్నా. 2024 నాకెంతో కలిసొచ్చిన సంవత్సరం. అంతకుముందు వరకు సరైన అవకాశం కోసం నిరీక్షించాను. ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా మంచి అవకాశం దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకున్నా.
అన్నీ నాకు అనుకూలంగా జరుగుతున్నాయి. అత్యుత్తమ ఆల్రౌండర్గా ఎదగడానికి మరింత కష్టపడాలని అనుకుంటున్నా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఎ సిరీస్తో నాకెంతో కీలకం. కంగారూ జట్టుతో పోరుకు ముందు ఆస్ట్రేలియాలో పిచ్లు, పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు ఇది మంచి అవకాశం.
వరల్డ్ బెస్ట్ ఆల్రౌండర్గా..
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని దేశంలో ప్రతి క్రికెటర్ కలగంటాడు. అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్ కావాలన్న లక్ష్యంతో నేను సాగుతున్నా. బౌలింగ్ పట్ల ఎక్కువ ఫోకస్ పెట్టడానికి అదే కారణం. బౌలింగ్లో ఇంకాస్త మెరుగైతే ఆల్రౌండర్గా రాణించవచ్చనే ఆలోచనతో ఉన్నా.
ఐపీఎల్ రిటెన్షన్, మెగా వేలం గురించి అస్సలు ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా ఫోకస్ అంతా భారత్-ఏ తరఫున ఆసీస్ గడ్డపై సత్తా చాటడంపైనే ఉంది. టెస్ట్ ఫార్మాట్లో రాణించాలంటే ఏకాగ్రత అవసరం.
గంభీర్ కీలక సలహా..
బంగ్లాదేశ్తో రెండో టీ20 సందర్భంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విలువైన సలహా ఇచ్చాడు. 'నీ బ్యాటింగ్లో పవర్ ఉంది. బంతిని సులువుగా బౌండరీ బయటకు పంపించగలవు. బంతి తక్కువ ఎత్తులో వచ్చే ఇలాంటి వికెట్లపై స్వీప్ షాట్స్ అవసరం లేద 'అని గంభీర్ చెప్పాడు. అతని సలహా మేరకు నా పవర్ను నమ్ముకొని భారీ షాట్లు ఆడా.
ఆస్ట్రేలియా పర్యటనలో ప్యాట్ కమిన్స్తో తలపడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. సన్రైజర్స్ హైదరాబాద్ సారథిగా కమిన్స్ వ్యూహాలెలా ఉంటాయో నాకు బాగా తెలుసు. బ్యాటర్లు తప్పిం చేసేలా వ్యూహాలు రచిస్తాడు. ఔట్ సైడ్ ఆఫ్స్టంప్ లైన్లో నిలకడగా బంతులు వేస్తాడు.
కమిన్స్ను ఎదుర్కోవాలంటే..
కమిన్స్ బౌలింగ్ను ఎదుర్కోవాలంటే చాలా ఓపిక అవసరం. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున కమిన్స్ సారథ్యాన్ని బాగా ఆస్వాదించా. ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకురాడు. 100కు ఆలౌటవుతారా? లేదా 250 పైచిలుకు పరుగులు చేస్తారా? అన్నది చూడకుండా స్వేచ్చనిస్తాడు.
దూకుడుగా ఆడమని ప్రోత్సహిస్తాడు. ఐపీఎల్లో కమిన్స్తో ఆడి.. ఇప్పుడు వ్యతిరేకంగా ఆడనుండటం ఉత్సాహంగా అనిపిస్తోంది.'అని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.