తన ఫేవరేట్ క్రికెటర్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బహుమతిగా ఇచ్చిన షూ వేసుకొనే మెల్బోర్న్ టెస్ట్లో సెంచరీ సాధించానని తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. తొలి సిరీస్లోనే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో అసాధారణ బ్యాటింగ్తో 171 బంతుల్లో తొలి సెంచరీ సాధించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి నితీష్ మూడెంకల స్కోర్ అందుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ కోసం సిద్దమైన నితీష్ కుమార్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెల్ బోర్న్ శతకం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'విరాట్ కోహ్లీ బహుమతిగా ఇచ్చిన షూస్తోనే మెల్ బోర్న్లో సెంచరీ సాధించాను. లాకర్ రూమ్లో కోహ్లీ.. సర్ఫరాజ్ ఖాన్ను షూ సైజ్ ఎంత అని అడిగాడు. దానికి సర్ఫరాజ్ 9 అని బదులిచ్చాడు. అప్పుడు కోహ్లీ వైపు తిరిగాడు. నాకు చాలా ఆనందం వేసింది. నా సైజ్ షూస్ కాకపోయినా.. సరే విరాట్ షూ నాకు కావాలని మనసులో అనుకున్నాను. నా షూ సైజ్ అడిగిన వెంటనే నేను 10 అని చెప్పాను. కోహ్లీ తన షూస్ నాకు ఇచ్చాడు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో నేను ఆ షూస్తోనే ఆడి సెంచరీ సాధించాను.

మెల్ బోర్న్ టెస్ట్లో సెంచరీ చేసిన వెంటనే మా నాన్న ముత్యాల రెడ్డి కోసం వెతికాను. 80 వేల మంది ప్రేక్షకుల మధ్య ఆయనను గుర్తించలేకపోయాను. కానీ తర్వాత బిగ్ స్క్రీన్పై ఆనందభాష్పాలతో కనిపించిన నాన్నను చూసి భావోద్వేగానికి గురయ్యాను. అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో అందరూ వచ్చి నన్ను అభినందించారు. కానీ నా కళ్లు మాత్రం కోహ్లీ కోసమే వెతికాయి. ఆయన వచ్చి నాతో మాట్లాడితే బాగుండనిపించింది. అంతలోనే కోహ్లీ వచ్చి బాగా ఆడావ్ అని మెచ్చుకున్నాడు. ఆ క్షణాలు నాకు ఎంతో ప్రత్యేకమైనవి.'అని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.