టీమిండియా ఆల్రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. 93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో పెర్త్ వేదికగా టెస్ట్, వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్తో నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు. దాంతో నితీష్ మూడు ఫార్మాట్ల ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికే నితీష్ భారత్ తరఫున 9 టెస్ట్లు, నాలుగు టీ20లు ఆడాడు.
గతేడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-2025లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన టెస్ట్తో నితీష్ సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ సిరీస్లో భారత్ గెలిచిన ఏకైక మ్యాచ్ కూడా ఇదే కావడం గమనార్హం. పెర్త్ వేదికగా బరిందర్ శ్రణ్, సుబ్రోతో బెనర్జీలు భారత్ తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేయగా.. హర్షిత్ రాణా, వినయ్ కుమార్లు టెస్ట్ల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నితీష్ ఒక్కడే పెర్త్ వేదికగా టెస్ట్తో పాటు వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు.

ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లీ(0) తీవ్రంగా నిరాశపర్చారు. కెప్టెన్ శుభ్మన్ గిల్(10) సైతం వారి బాటలో నడిచాడు. టీమిండియా 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(6 బ్యాటింగ్), అక్షర్ పటేల్(7 బ్యాటింగ్) ఉన్నారు. ఈ క్రమంలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. వర్షం ఆగిపోయే సమయానికి భారత్ 11.5 ఓవర్లలో 37/3 స్కోర్ చేసింది.