టీమిండియా యువ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి టెస్ట్ సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్లో ఈ తెలుగోడు అరంగేట్ర సెంచరీతో ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు. మూడో రోజు ఆటలో అనేక నాటకీయ పరిణామాల మధ్య సినిమాటిక్ తరహాలో స్కాట్ బోలాండ్ బౌలింగ్లో లాంగాన్ దిశగా బౌండరీ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు.
221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును నితీష్ సంచలన బ్యాటింగ్తో ఆదుకున్నాడు. వాషింగ్టన్ సుందర్(160 బంతుల్లో ఒక్క ఫోర్తో 50) కలిసి 8వ వికెట్కు 127 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సుందర్, జస్ప్రీత్ బుమ్రా ఔటైనా.. సిరాజ్ సాయంతో సెంచరీ మార్క్ అందుకొని తన కలను సాకారం చేసుకున్నాడు.

నితీష్ సంచలన శతకంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 116 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డితో పాటు మహమ్మద్ సిరాజ్(0 బ్యాటింగ్) ఉన్నాడు. భారత్ ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ మూడేసి వికెట్లు తీయగా.. నాథన్ లయన్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 474 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.
ఈ శతకంతో నితీష్ కుమార్ రెడ్డి అనిల్ కుంబ్లే పెరిట ఉన్న రికార్డ్ను అధిగమించాడు. 2008లో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో అనిల్ కుంబ్లే 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగి 87 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే నెంబర్ 8 బ్యాటర్ హయ్యెస్ట్ స్కోర్గా ఉండగా.. నితీష్ అధిగమించాడు.
45 ఏళ్ల రికార్డ్ సమం..
ఈ మ్యాచ్లో నితీష్-సుందర్ 8వ వికెట్కు 127 పరుగులు జోడించి 45 ఏళ్ల రికార్డ్ను సమం చేశారు. 1979లో వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కర్సన్ గర్వీ-సయ్యద్ కిర్మాణి 8వ వికెట్కు 127 పరుగులు జోడించారు.