రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా సంగీత్ కార్యక్రమం నిర్వహించగా.. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీ20 ప్రపంచకప్ విజేతలు, ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు అరుదైన గౌరవం లభించింది.
సంగీత్ వేడుక వేదికపైకి ఈ ప్రపంచకప్ విజేతలను నీతా అంబానీ సాదరంగా ఆహ్వానించగా.. అక్కడున్న ప్రముఖులంతా చప్పట్లతో వారిని అభినందించారు. దాంతో ఆ ప్రాంగణమంతా టీమిండియా నినాదాలతో మార్మోగిపోయింది. ఈ సందర్భంగా వారి విజయాన్ని ప్రశంసిస్తూ నీతా అంబానీ కన్నీటి పర్యంతమయ్యారు.

తొలుత రోహిత్ శర్మను వేదికపైకి ఆహ్వానించిన ఆమె ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. రోహిత్ తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలను ఆహ్వానించిన నీతా అంబానీ ప్రపంచకప్లో వారి పాత్రను, ఘనతలను వివరించారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు వేదికపై వచ్చి నీతా అంబానీని హత్తుకున్నారు.
'కష్టాలు ఎప్పటికీ ఉండవు. కానీ వాటికి ఎదురు నిలిచినవారే ముందుకు సాగగలరు'అని హార్దిక్ పాండ్యాపై వచ్చిన విమర్శలను ఉద్దేశించి నీతా అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ముఖేష్ అంబానీ ప్రపంచకప్ విజేతలను అభినందించారు. 2011 తర్వాత దేశానికి ప్రపంచకప్ అందించి అందరూ గర్వపడేలా చేశారంటూ కొనియాడారు. ఈ వేడుకలో రోహిత్, సూర్య, హార్దిక్ ముగ్గురూ.. నల్లని దుస్తులు ధరించడం విశేషం. ఈ వేడుకకు టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా హాజరయ్యారు.
ముంబై ఇండియన్స్కే చెందిన జస్ప్రీత్ బుమ్రా ఈ వేడుకకు హాజరు కాలేదు. అంతకుముందు జరిగిన సంగీత్ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు ఆటాపాటాలతో అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.