
న్యూఢిల్లీ: ఓవైపు ఇంగ్లండ్తో నాలుగు టెస్ట్ల సిరీస్ కోసం టీమిండియా సమయాత్తం అవుతుండగా.. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో సాధించిన చారిత్రాత్మక విజయం హాట్ టాపిక్ అవుతోంది. ఆదివారం మన్ కీ బాత్లో దేశ ప్రధాని నరేంద్రమోదీ టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని కొనియాడగా.. తాజాగా కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా టీమిండియా విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు.
సోమవారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నమ్మకం యొక్క ప్రాముఖ్యత తెలియజేసేందుకు రవీంద్రనాధ్ ఠాగూర్ కొటెషన్ ఒకటి చెప్పిన ఆమె.. టీమిండియా విజయాన్ని సైతం ప్రస్తావించారు. 'ఆస్ట్రేలియాలో టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించడం పట్ల క్రికెట్ను ప్రేమించే దేశంగా మనమెంతో ఆనందించాం. యువతకు ఎలాంటి మద్దతు ఇస్తున్నామో అనేది ఈ విజయం గుర్తుచేస్తుంది.'అని నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఆస్ట్రేలియా కంచుకోట గబ్బా మైదానంలో చివరి టెస్టును కైవసం చేసుకుని టీమిండియా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 32ఏళ్ల తర్వాత ఆసీస్ను ఆ మైదానంలో ఓడించి చారిత్రక విజయం నమోదు చేసింది. అడిలైడ్లో తొలి టెస్ట్లో ఘోరంగా ఓడినా..మెల్బోర్న్లో మెరిసి, సిడ్నీలో పోరాడి, గబ్బాలో గర్జించి 2-1తో సిరీస్ దక్కించుకుంది.
ఇక ఆదివారం జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించిన భారత క్రికెట్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు . జట్టు పోరాటతత్వం ఎంతో అభినందనీయమని కొనియాడారు. "క్రికెట్ ప్రపంచం నుంచి ఈ నెలలో శుభవార్త అందింది. ఆరంభంలో ఎదురుదెబ్బలు తిన్నా.. అద్వితీయంగా పుంజుకుని ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచాం. మన జట్టు కఠోర శ్రమ, సమష్టి కృషి ఎంతో స్ఫూర్తిదాయకం."అని మోదీ తెలిపారు.
ఇక మోదీ ప్రశంసలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కృతజ్ఞతలు తెలియజేసింది . "మీ ప్రశంసలకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు మోదీజీ.. భారత త్రివర్ణ పతాకం ఎగురుతూనే ఉండేందుకు మా సాయశక్తుల ప్రయత్నిస్తాం," అని ట్వీట్ చేసింది. ఇక భారత్ వేదికగా ఇంగ్లాండ్తో జరగనున్న టెస్టు సిరీస్ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభంకానుంది.