టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ నిక్ నైట్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో రోహిత్ తన మార్క్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. మూడో రోజు ఆటలో రోహిత్ తన మార్క్ కెప్టెన్సీ కనబర్చాడని, సరైన ఫీల్డింగ్, బౌలింగ్ మార్పులతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడని చెప్పాడు.
ఇక 207/2 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ 319 పరుగులకే కుప్పకూలింది. 112 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లండ్ చివరి 8 వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.

ఈ ప్రదర్శనపై జియోసినిమాతో మాట్లాడిన నిక్ నైట్.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు భారత బౌలర్లను ప్రశంసించాడు. 'మనం బజ్బాల్ ఎలా పనిచేస్తుందో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో బజ్బాల్ ఎంత నష్టం చేస్తుందో చర్చించుకుందాం. అయితే ఇది బజ్ బాల్ అప్రోచా? కాదా? అనేది తెలియదు.
భారత్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసింది. అసాధారణ ప్రదర్శనతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించింది. రోహిత్ శర్మ సైతం తన మార్క్ సారథ్యంతో జట్టును నడిపించాడు. సిరాజ్ నుంచి ఇలాంటి ప్రదర్శనలను ఇప్పటికే చాలా చూశాం. జో రూట్ నిర్లక్ష్యపు షాట్తో ఈ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ పతనం మొదలైంది. ఆ వికెట్ తర్వాత ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది.
ప్రస్తుతం ఈ మ్యాచ్లో ఇంగ్లండ్పై భారత్ పై చేయి సాధించింది. జో రూట్ అనవసరపు షాట్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను దెబ్బతీసింది. అయితే ఇంగ్లండ్ జట్టుకు ఉన్న సానుకూలంశం ఏంటంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో ఈ తరహా పరిస్థితుల నుంచి తేరుకొని విజయాలు అందుకున్న సందర్బాలు ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఏం జరిగినా.. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఈ మ్యాచ్పై మాత్రం భారత్ పట్టు బిగించింది.
126 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ(19) విఫలమైనా.. యశస్వి జైస్వాల్(92 బ్యాటింగ్), శుభ్మన్ గిల్(30 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు. దాంతో భారత్ 37 ఓవర్లలో వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 445 పరుగులకు ఆలౌటైంది.