
ఆ వ్యూహం బెడిసి కొట్టింది..
'చివరి ఓవర్లలో తడబడటంతోనే గెలిచే మ్యాచ్లో ఓటమిపాలయ్యాం. అక్షర్ పటేల్ అద్భుతంగా ఆడాడు. దాంతో మేం మా జోరును కొనసాగించలేకపోయాం. చివరి ఐదు ఓవర్లలో పరిస్థితులను మాకు అనుకూలంగా మార్చుకోలేకపోయాం. స్పిన్నర్లలో బ్యాటింగ్ తేలిక అయిందని భావించాం. ఎడమ చేతి బ్యాటర్లకు లెఫ్టార్మ్ బౌలర్ అయిన అకీల్తో బౌలింగ్ చేయించడం బెడిసి కొట్టింది. ఒక్క వికెట్ వచ్చుంటే ఫలితం మరోలా ఉండేది. కానీ అక్షర్ అద్భుతంగా ఆడాడు.
బ్యాటింగ్లో మేం అసాధారణ ప్రదర్శన కనబర్చాం. హోప్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మాకు విజయం కావాలి. విజయం కోసం మేం చాలా కష్టపడ్డాం. చివరి మ్యాచ్లోనైనా గెలిచి తీరుతాం. అదే మా లక్ష్యం'అంటూ పూరన్ చెప్పుకొచ్చాడు.

షై హోప్ శతకం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. కెరీర్లో 100వ వన్డే ఆడిన ఓపెనర్ షై హోప్(135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 115) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ (77 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 74) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా.. దీపక్ హుడా, చాహల్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 312 పరుగులు చేసి 2 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్(13) విఫలమైనా.. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్(49 బంతుల్లో 5 ఫోర్లతో 43) ఫర్వాలేదనిపించాడు.

అదరగొట్టిన అక్షర్ పటేల్
ఇక శ్రేయస్ అయ్యర్(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 63), సంజూ శాంసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో దీపక్ హుడా సాయంతో అక్షర్ పటేల్ ధాటిగా ఆడాడు. హుడా వెనుదిరిగినా.. సిరాజ్(1 నాటౌట్) సాయంతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి.
క్రీజులో సిరాజ్ ఉండటంతో విజయం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ వరుసగా మూడు బంతులు సింగిల్ తీసిన అక్షర్.. నాలుగో బంతికి భారీ సిక్సర్తో ఇన్నింగ్స్ ముగించాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, కైల్ మేయర్స్ రెండేసి వికెట్లు తీయగా.. సీల్స్, రొమారియో, అకీల హోసిన్ తలో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications












