హైదరాబాద్: తండ్రైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అతని సతీమణి, స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ సోమవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మధుర క్షణాలను ఆస్వాదించేందుకు బుమ్రా భారత జట్టును వదిలి ముంబైకి వచ్చేసిన విషయం తెలిసిందే.
ఆసియాకప్ 2023 కోసం శ్రీలంక పర్యటనలో ఉన్న బుమ్రా.. ఆదివారమే ముంబై చేరుకున్నాడు. ప్రసవ సమయంలో తన సతీమణి పక్కనే ఉండి తండ్రైన మధుర క్షణాలను ఆస్వాదించాడు. ఇక తాము తల్లిదండ్రులైన విషయాన్ని బుమ్రా జోడీ.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

తమ కుమారుడికి అంగద్ జస్ప్రీత్ బుమ్రాగా పేరు పెట్టినట్లు వెల్లడించారు. 'మా చిన్ని కుటుంబం ఇప్పుడు పెద్దదైంది. మునుపెన్నడు లేని విధంగా మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. ఈ ఉదయమే మా అబ్బాయి అంగద్ జస్ప్రీత్ బుమ్రా ఈ ప్రపంచంలోకి వచ్చాడు. మా ఆనందానికి అవధుల్లేవు. ఈ కొత్త చాప్టర్లో వచ్చే ఆనందాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను'అని బుమ్రా దంపతులు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశారు.
అలాగే ఈ కొత్త ఛాప్టర్లో తమ జీవితాల్లో వచ్చే ఆనందాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు బుమ్రా తెలిపాడు. ఇక అంగద్ బుమ్రాకు స్వాగతం పలికిన అభిమానులు.. బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరైతే అంగద్ బుమ్రా టీమిండియా స్టార్ బ్యాటర్గా ఎదుగుతాడని, తండ్రిలా అస్సలు బౌలింగ్ను కెరీర్గా ఎంచుకోడని జోస్యం చెబుతున్నారు.
అయితే ఈ కామెంట్స్పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు పుట్టిన చిన్నారిపై బ్యాటర్.. బౌలర్ అంటూ ఒత్తిడి పెట్టకండని సూచిస్తున్నారు. 'ఇది అన్యాయంరా.. ఈ రోజే పుట్టాడురా.. అప్పుడే బ్యాటర్ అంటున్నారు. స్వేచ్చగా పెరిగి తనకు నచ్చిన పని చేసేలా చూడండి. దయచేసి ఇలాంటి కామెంట్స్ చేయవద్దు'అని రిక్వెస్ట్ చేస్తున్నారు.
బుమ్రా స్వదేశానికి తిరిగిరావడంతో నేపాల్తో మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో మహమ్మద్ షమీ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి నేపాల్ 37.5 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది.