
కరాచీ: పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ చివరి నిమిషంలో రద్దయింది. భద్రతాపరమైన కారణాల వల్ల నేడు(శుక్రవారం) జరగాల్సిన మొదటి వన్డేకు కొద్ది నిమిషాల ముందు పాక్ పర్యటన నుంచి తప్పుకుంటున్నట్లు న్యూజిలాండ్ టీమ్మేనేజ్మెంట్ తెలిపింది. పాకిస్థాన్ పర్యటనలో భాగంగా న్యూజిలండ్ ఆతిథ్య జట్టుతో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్లు ఆడాల్సింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ పర్యటన జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా నేడు రావల్పిండి వేదికగా మొదటి వన్డే జరగాల్సింది.
అయితే భద్రతాపరమైన కారణాల దృష్ట్యా టాస్కు కొన్ని నిమిషాల ముందు మొత్తం పర్యటననే నిలిపివేశారు. దీనిపై కివీస్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది."న్యూజిలాండ్ సెక్యూరిటీ విభాగం సూచన మేరకు పర్యటన రద్దు చేసుకుంటున్నాం. ఈ సిరీస్ రద్దవ్వడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై పెద్ద ప్రభావం చూపిస్తుందని తెలుసు. పీసీబీ అద్భుతంగా ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని న్యూజిలాండ్ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ ఆ ప్రకటనలో తెలిపారు.
2003లో చివరిసారిగా పాకిస్థాన్లో పర్యటించిన న్యూజిలాండ్.. మళ్లీ ఇన్నాళ్లకు దాయదీ గడ్డపై అడుగుపెట్టింది. కానీ అంతలోనే అనూహ్య పరిస్థితుల మధ్య ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఇక ఈ పర్యటనకు న్యూజిలాండ్ నామమాత్రపు జట్టుతోనే వెళ్లింది. ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ మ్యాచ్ల నేపథ్యంలో ప్రధాన ఆటగాళ్లంతా జట్టుకు దూరంగా ఉన్నారు.
ఇక షెడ్యూల్ ప్రకారమే సిరీస్ను కొనసాగించే పాకిస్థాన్ సిద్దంగా ఉందని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. చివరి నిమిషంలో న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణయంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారని పేర్కొంది. ఇక పీసీబీ చేసిన ఏర్పాట్ల పట్ల న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా సంతృప్తికరంగానే ఉన్నారని, ఈ విషయం వారే వెల్లడించారని కూడా ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇక ఇలా చివరి నిమిషంలో సిరీస్ రద్దు చేసుకోవడంపై పాకిస్థాన్ క్రికెట్పై తీవ్ర ప్రభావం చూపనుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరే జట్టు కూడా పాకిస్థాన్లో పర్యటించేందుకు ధైర్యం చేయదంటున్నారు.