IND vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రాయ్పూర్లో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సహా జట్టు సభ్యులందరూ నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. సాధారణంగా ఎవరైనా ప్రముఖులు మరణించినప్పుడు లేదా ఏదైనా విచారకర సంఘటన జరిగినప్పుడు క్రికెటర్లు ఇలా చేస్తుంటారు. అయితే ఈ సారి న్యూజిలాండ్ ఆటగాళ్లు తమ మాతృభూమిలో ప్రకృతి వైపరీత్యాల వల్ల కోల్పోయిన వారి కోసం ఈ గౌరవ సూచకమైన పని చేశారు.
న్యూజిలాండ్లోని దక్షిణ ద్వీపకల్పంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఆ దేశం అతలాకుతలమైంది. మౌంట్ మాంగనుయ్ విషాదం: జనవరి 22 (గురువారం) నాడు మౌంట్ మాంగనుయ్ సమీపంలోని ఓ క్యాంప్సైట్పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. చాలామంది గాయపడ్డారు.తౌరంగ నగరంలో కేవలం 30 గంటల్లోనే 295 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీనివల్ల నివాస గృహాలు, పంట పొలాలు నీట మునిగాయి. అక్కడి పరిస్థితులను చూస్తుంటే ఒక 'యుద్ధ క్షేత్రం'లా కనిపిస్తోందని న్యూజిలాండ్ అత్యవసర సేవల మంత్రి మార్క్ మిచెల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐదు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.

తమ దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంఘీభావంగా.. మరణించిన వారికి నివాళిగా న్యూజిలాండ్ క్రికెటర్లు ఈ నల్ల రిబ్బన్లను ధరించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే గ్లెన్ ఫిలిప్స్ వంటి ఆటగాళ్లు తమ తోటి సహచరులకు ఈ బ్యాండ్లను కడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మ్యాచ్ అప్డేట్
ఈ ఉద్వేగభరిత వాతావరణంలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 208 పరుగులు చేసింది. కెప్టెన్ సాంట్నర్ (47), రచిన్ రవీంద్ర (44) రాణించారు. అయితే భారత్ తరపున ఇషాన్ కిషన్(76), సూర్యకుమార్ యాదవ్(82) విధ్వంసం సృష్టించడంతో కివీస్ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్(27 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 47 నాటౌట్), రచిన్ రవీంద్ర(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(2/35) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 15.2 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసి 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. ఓపెనర్లు సంజూ శాంసన్(6), అభిషేక్ శర్మ(0) విఫలమైనా.. ఇషాన్ కిషన్, సూర్య, శివమ్ దూబే(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 35 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, జాకోబ్ డఫీ, ఇష్ సోధీ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 ఆదివారం గౌహతి వేదికగా జరగనుంది.