టీమిండియా ముందు 300 పరుగుల లక్ష్యం కూడా చిన్నబోయేలా ఉందని న్యూజిలాండ్ టీ20 కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చమత్కరించాడు. భారత జట్టుకు బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉందని, ప్రతీ ఒక్కరు స్వేచ్ఛగా ఆడుతున్నారని కొనియాడాడు. న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా రాయ్పూర్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
209 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే టీమిండియా ఛేదించడం గమనార్హం. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్.. భారత బ్యాటర్ల విధ్వంసం ముందు తమ బౌలర్లు తేలిపోయారని అంగీకరించాడు. తాము ఇంకాస్త కట్టడిగా బౌలింగ్ చేయాలని, బ్యాటింగ్లోనూ ధాటిగా ఆడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
'భారత జట్టుపై లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే 300 పరుగులు చేయాలేమో. అవి కూడా సరిపోతాయనే గ్యారెంటీ లేదు. టీమిండియాకు మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది. పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో తొలి బంతి నుంచి అటాకింగ్ అప్రోచ్తో ఆడుతోంది. ప్రతీ బ్యాటర్కు స్వేచ్ఛగా ఆడే వెసులుబాటు ఉంది. మేం వీలైనంత వరకు భారత బ్యాటర్లను కట్టడి చేయాల్సింది. మరోవైపు 200, 210 పరుగులు కూడా ఇప్పుడు సరిపోవడం లేదు. కాబట్టి మేం ఇంకాస్త దూకుడుగా బ్యాటింగ్ చేయాలి.

మా వరల్డ్ కప్ టీమ్ కాంబినేషన్పై అవగాహన వచ్చింది. ఇంకా కొంత మంది ఆటగాళ్లు జట్టులోకి రావాల్సి ఉంది. ప్రపంచకప్ ఆరంభ సమయానికి అందరూ ఫామ్లో ఉండాలని మేం కోరుకుంటున్నాం. అందుకోసం ఈ మ్యాచ్ తరహాలోనే ఆటగాళ్లను రొటేట్ చేయాల్సి రావచ్చు. ఈ సిరీస్లో మేం గెలవాలనే అనుకుంటున్నాం. ఈ రోజు చాలా ఒత్తిడికి గురయ్యాం. మేం నేర్చుకోవడానికి, తిరిగి పుంజుకోవడానికి ఈ సిరీస్ మాకు మంచి అవకాశం. ఎందుకంటే మరో రోజులో మేం మళ్లీ మ్యాచ్ ఆడాల్సి ఉంది.
నేను నా బ్యాటింగ్ను ఆస్వాదిస్తున్నాను. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరుగులు చేయాలి. అది నా బాధ్యత. పిచ్ చాలా బాగుంది. ఔట్ ఫీల్డ్ కూడా చాలా వేగంగా ఉంది. దాంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో బ్యాటింగ్ చేశాను. పిచ్ ఫ్లాట్గా ఉన్నప్పుడు నేను బౌలింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి బౌలింగ్లో కూడా రాణించడం ముఖ్యం.
ఈ మ్యాచ్లో మంచు తీవ్ర ప్రభావం చూపింది. స్పిన్నర్గా తడి బంతిని పట్టుకోవడం కొంచెం సవాల్తో కూడుకున్న పని. కానీ ఇక్కడ మిగిలిన చోట్ల కంటే కొంచెం చలిగా ఉంది. మేం ఈ కండిషన్స్కు అలువాటు పడి తదుపరి మ్యాచ్లో మంచు ప్రభావం ఎలా ఉంటుందో చూసుకొని ముందుకు సాగుతాం.'అని మిచెల్ సాంట్నర్
చెప్పుకొచ్చాడు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 82 నాటౌట్), ఇషాన్ కిషన్(32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 76) ఊచకోతతో న్యూజిలాండ్ విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. శివమ్ దూబే(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 35 నాటౌట్) దూకుడుగా ఆడాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 ఆదివారం గౌహతి వేదికగా జరగనుంది.