
దుబాయ్: న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్, టీ20 ప్రపంచకప్ హీరో డారిల్ మిచెల్కు అరుదైన అవార్డు దక్కింది. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో బౌలర్కు అడ్డుపడ్డానని భావించి సులువైన పరుగు తీయకుండా క్రీడా స్పూర్తిని చాటుకున్న మిచెల్కు ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డును ప్రకటించింది.
ఇంగ్లండ్తో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో లక్ష్య ఛేదనలో భాగంగా 17 ఓవర్లు పూర్తయిన సమయానికి కివీస్ 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అదిల్ రషీద్ 18వ ఓవర్ తొలి బంతిని వేశాడు. స్ట్రైక్లో ఉన్న జేమ్స్ నీషమ్ లాంగ్ ఆఫ్వైపు బంతిని బాది పరుగుకు ప్రయత్నించాడు. అయితే బంతిని ఆపేందుకు బౌలర్ రషీద్ ప్రయత్నిస్తున్న క్రమంలో అనుకోకుండా మిచెల్ అడ్డువచ్చాడు. దీంతో రషీద్కు అడ్డుపడ్డానని భావించిన మిచెల్.. నీషమ్ను వెనక్కు వెళ్లమని చెప్పాడు. కానీ ఆ తర్వాత మిచెల్-నీషమ్ ద్వయం అద్భుతమైన బ్యాటింగ్తో జట్టుకు విజయాన్ని అందించింది.
ఐసీసీ అవార్డు అందుకున్న నేపథ్యంలో అప్పటి ఘటనను గుర్తుచేస్తుకున్న మిచెల్.. "మేము మ్యాచ్ గెలిచేందుకు అన్ని విధాలా కృషి చేస్తాం. అలా అని క్రికెట్లోని నైతిక విలువలను ఉల్లంఘించం. ఆ రోజు రషీద్కు నేను అడ్డువచ్చానని అనిపించింది. అందుకే పరుగు తీయలేదు." అని చెప్పుకొచ్చాడు. ఈ అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉందని.. న్యూజిలాండర్లగా మేము గర్వపడుతున్నామని మిచెల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఫైనల్ చేరిన న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి తృటిలో టైటిల్ను చేజార్చుకున్న విషయం తెలిసిందే.