న్యూజిలాండ్ వన్డే టీమ్ చరిత్ర సృష్టించింది. సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. గత 42 ఏళ్లలో ఇంగ్లండ్ను క్లీన్ స్వీప్ చేయడం న్యూజిలాండ్కు ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన కెప్టెన్గా మిచెల్ సాంట్నర్ చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్తో శనివారం జరిగిన ఆఖరి వన్డేలో 2 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా న్యూజిలాండ్ ఈ ఫీట్ సాధించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 222 పరుగులు చేసింది. జెమీ ఓవర్టన్(62 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 68) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. జోస్ బట్లర్(56 బంతుల్లో 7 ఫోర్లతో 38), బ్రైడన్ కార్స్(30 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 36) విలువైన పరుగులు చేశారు.

న్యూజిలాండ్ బౌలర్లలో బ్లయర్ టిక్నర్(4/64) నాలుగు వికెట్లు తీయగా.. జాకోబ్ డఫ్ఫీ(3/56) మూడు వికెట్లు పడగొట్టాడు. జాక్ ఫోల్కర్స్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం న్యూజిలాండ్ 44.4 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగులు చేసి గెలుపొందింది. రచిన్ రవీంద్ర(37 బంతుల్లో 7 ఫోర్లతో 46), డారిల్ మిచెల్(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో జెమీ ఓవర్టన్, సామ్ కరన్ రెండేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లను గెలిచిన న్యూజిలాండ్ 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ చివరిసారిగా 1983లో జియోఫ్ హోవర్త్స్ సారథ్యంలో ఇంగ్లండ్ వైట్ వాష్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు మిచెల్ సాంట్నర్ సారథ్యంలో ఈ ఘనతను అందుకుంది.