New Rule In Cricket: పరిమిత ఓవర్ల క్రికెట్లో కొత్త రూల్ ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సిద్దమైంది. బ్యాటర్ల టైమ్డ్ ఔట్ తరహాలో.. బౌలర్ ఆలస్యం చేస్తే పెనాల్టీ విధించాలని ఐసీసీ నిర్ణయించింది. బౌలింగ్ సమయంలో జట్లు సుదీర్ఘ సమయం తీసుకుంటుండటంతో మ్యాచ్లు ఆలస్యంగా ముగుస్తున్నాయి.
ఈ సమస్యను తగ్గించేందుకు ఇప్పటికే స్లో ఓవరేట్ పేరిట కెప్టెన్లతో పాటు ఆటగాళ్లకు జరిమానా విధిస్తున్న ఐసీసీ.. నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయకపోతే 30 యార్డ్ సర్కిల్ బయట ఒక ఫీల్డర్ను తక్కువ పెట్టే రూల్ కూడా తీసుకొచ్చింది. అయినా స్లో ఓవర్ రేట్లో మార్పులు రాకపోవడంతో ఇప్పుడు స్టాప్ క్లాక్ రూల్ను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది.

ఈ రూల్ ప్రకారం.. బౌలింగ్ టీమ్ మూడు సార్లు 60 సెకన్ల తర్వాత ఓవర్ ప్రారంభించడంలో విఫలమైతే 5 పరుగులు పెనాల్టీ విధించనున్నారు. ఈ రూల్ను డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనుంది. స్టాప్ క్లాక్ సాయంతో ఓవర్ల మధ్య ఆలస్యాన్ని గుర్తించనున్నారు.
ఈ రూల్ అమలై 5 పరుగుల పెనాల్టీ విధిస్తే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఈ రూల్పై ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రూల్ కారణంగా క్రికెట్లో ఉన్న అసలు మజా మిస్సవుతుందని, ఫలితాలన్నీ తారుమారయ్యే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. బౌలర్లు కూడా ఒళ్లు దగ్గరపెట్టుకొని బౌలింగ్ చేస్తారని, కెప్టెన్లు కూడా సమయాన్ని వృథా చేయరంటున్నారు.
బ్యాటర్ల ఆధిపత్యం నడుస్తున్న ప్రస్తుత క్రికెట్లో ఈ కొత్త రూల్ బౌలర్లకు ప్రతికూలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. 60 సెకన్లలోనే బౌలింగ్ చేయాలంటే.. ఫీల్డ్ సెటప్ చేసుకోవడం కుదురదని కామెంట్ చేస్తున్నారు.