దుబాయ్: ఇప్పటికే ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్లను నాలుగు రోజులకు కుదించాలనే యోచనలో ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ).. తాజాగా మరో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 2023-31 మధ్య కాలంలో టీ20 ఛాంపియన్స్ కప్ను నిర్వహించాలనే సరికొత్త ఆలోచనతో ఉంది. గతేడాది వన్డే ప్రపంచకప్ మాదిరే ఈ టోర్నీలోనూ మొత్తం 48 మ్యాచ్లు ఆడే అవకాశముందని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో పేర్కొంది. ఐసీసీ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ప్రకారం.. 2024, 2028 సంవత్సరాల్లో టీ20 ఛాంపియన్స్ కప్ నిర్వహించాలని భావిస్తుండగా.. 2025, 2029ల్లో వన్డే ఛాంపియన్స్ కప్ ఉండాలనుకుంటోంది.
అలాగే 2026, 2030ల్లో టీ20 ప్రపంచకప్, 2027, 2031లో వన్డే ప్రపంచకప్ నిర్వహించాలని భావిస్తోంది. 2023-31 మధ్య కాలంలో తాము ప్రతిపాదించిన అంశాలపై తమ అభిప్రాయాన్ని మార్చి 15లోగా వెల్లడించాలని ఐసీసీ శాశ్వత సభ్య దేశాలను ఐసీసీ ఆదేశించినట్లు తెలుస్తోంది.
అయితే, క్రికెట్ పెద్దన్న బీసీసీఐ, ఈసీబీ, సీఏ బోర్డులు ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే.. ఈ మూడు ప్రధాన బోర్డులు ఇప్పటికే తాము ద్వైపాక్షిక సిరీస్లు ఆడాలనుకున్నట్లు స్పష్టం చేశాయి.
ఒకవేళ ఐసీసీ.. తన నిర్ణయానికే కట్టుబడితే ఈ మూడు దేశాల బోర్డులు తీవ్రంగా నష్ట పోనున్నాయి. కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఐసీసీ శాశ్వత సభ్యత్వ దేశాలు ఆ మెగా టోర్నీల నిర్వహణకు ముందుకొస్తే వాటికి టికెటింగ్, ఆతిథ్యం, క్యాటరింగ్ విభాగాల్లో ఆదాయం లభిస్తుంది. ఐసీసీకి బ్రాడ్కాస్ట్ హక్కులతో పాటు కమర్షియల్ విభాగంలో ఆదాయం ఆర్జించే అవకాశం ఉంది. మరోవైపు మహిళల క్రికెట్లోనూ టీ20, వన్డే ఛాంపియన్స్ కప్లను తీసుకురావాలని ఐసీసీ భావిస్తోంది.