Kohli vs BCCI: థ్యాంక్యూ కెప్టెన్ అంటూ బీసీసీఐ ట్వీట్.. సిగ్గుండాలంటూ ఫ్యాన్స్ ఫైర్!

న్యూఢిల్లీ: వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తూ కనీసం అతనికి ధన్యవాదాలు కూడా తెలపని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎట్టకేలకు తమ తప్పును సరిదిద్దుకుంది. విరాట్ కోహ్లీ కనీసం థ్యాంక్స్ చెబుతూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడంతో అభిమానులు, విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు బీసీసీఐ తీరును తప్పుబట్టారు. దాంతో దారిలోకి వచ్చిన భారత క్రికెట్ బోర్డు 24 గంటల తర్వాత 'థ్యాంక్యూ కెప్టెన్'అంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇందులో కెప్టెన్గా విరాట్ కోహ్లీ సాధించిన ఘనతలను పేర్కొంది. అంతటితో ఆగకుండా కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఆడిన గొప్ప ఇన్నింగ్స్లను అభిమానులతో పంచుకుంది. 'పట్టుదల, పోరాటతత్వం, అంకితభావంతో జట్టును నడిపించిన నాయకుడు' అంటూ విరాట్ కోహ్లీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది.
కెప్టెన్గా మరుపరాని ఇన్నింగ్స్లంటూ..
2017లో ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ( 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 122) అద్భుత సెంచరీ బాదాడు. దీంతో ఇంగ్లండ్ నిర్దేశించిన 351 భారీ లక్ష్యాన్ని భారత్ 48.1 ఓవర్లలోనే ఛేదించింది. అలాగే, 2018లో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో కూడా కోహ్లీ అదరగొట్టాడు. 5 వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో కోహ్లీ (107 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్లతో 140) భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 117 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్స్లతో 152)కూడా భారీ శతకం నమోదు చేశాడు. దీంతో వెస్టిండీస్ నిర్దేశించిన 326 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ సిరీస్ను భారత్ 3-1 తేడాతో గెలుచుకుంది.
కెప్టెన్గా సూపర్ రికార్డు..
విరాట్ కోహ్లీ నాయకత్వంలో మొత్తం 95 వన్డే మ్యాచ్లు ఆడిన టీమిండియా 65 విజయాలను నమోదు చేసింది. 27 మ్యాచుల్లో ఓటమి చవిచూడగా.. మరో మూడు మ్యాచ్లు రద్దు/టై అయ్యాయి. దీంతో విరాట్ విజయాల శాతం 70.43 శాతంగా ఉంది. అలానే కోహ్లీ కెప్టెన్సీలో 19 ద్వైపాక్షిక సిరీసుల్లో పదిహేను సిరీసులను భారత్ కైవసం చేసుకుంది. వన్డే కెప్టెన్సీనుంచి తొలగించిన రోజు కోహ్లీ ఘనతల గురించి ఏమాత్రం ప్రస్తావించని బీసీసీఐ ఒక రోజు తర్వాత పొగుడ్తూ పోస్ట్లు పెట్టడాన్ని అభిమానులు మండిపడుతున్నారు.

సిగ్గు లేదు..
ఇలాగేనా టాప్ బ్యాటర్, కెప్టెన్కు ధన్యావాదాలు తెలిపేది? అని ట్రోల్స్ మొదలెట్టారు. విదేశీ మీడియా సైతం గౌరవించే కోహ్లీ.. బీసీసీఐకి అర్హుడిగా కనిపించలేదా? అని ఒక నెటిజన్ అనగా.. మరికొందరు #ShameOnBCCI అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేశారు. 'టీ20 ఫార్మాట్కు ఒక కెప్టెన్.. వన్డేలకు మరో కెప్టెన్ ఉండవద్దని రూల్ ఏమైనా ఉందా! ఒకవేళ జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నా.. కోహ్లీకి కృతజ్ఞతలు చెప్పడానికి ఇంత సమయం పట్టిందా! ఇప్పుడే మీకు తెల్లారిందా! ఇలా ఆలస్యంగా పోస్టు పెట్టడం చూస్తుంటేనే మీ మనసులో ఉన్న ఉద్దేశాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఏదేమైనా కోహ్లీనే మా కింగ్.. అతని ఎప్పటిలానే అభిమానిస్తాం'అని కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications