పాకిస్థాన్ క్రికెటర్ల ఫిట్నెస్ విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 2024 సీజన్ ముగిసిన వెంటనే జాతీయ జట్టు సభ్యులందరికీ పాకిస్థాన్ సైన్యంలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. సైన్యంలో శిక్షణతో ఆటగాళ్ల ఫిట్నెస్ మెరుగుపడుతుందని భావిస్తోంది.
విదేశీ ఆటగాళ్ల తరహాలో పాకిస్థాన్ ఆటగాళ్లు ఫిట్గా లేకపోవడం.. తరుచూ గాయాల బారిన పడుతుండటం.. సిక్సర్లు కొట్టలేకపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ ఆటగాళ్లలా ఫిట్గా ఉండాలంటే పాకిస్థాన్ క్రికెటర్లకు ఆర్మీ ట్రైనింగ్ అవసరమని పీసీబీ భావిస్తోంది. ఈ విషయాన్ని ఆటగాళ్లకు తెలియజేసినట్లు పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నక్వీ తెలిపారు.

పీఎస్ఎల్ ముగిసిన వెంటనే పాకిస్థాన్ ఆర్మీతో 10 రోజుల ట్రైనింగ్ క్యాంప్ ఉంటుందని చెప్పారు. పాకిస్థాన్ ఆటగాళ్లు సిక్స్లు బాదడంలో ఇబ్బంది పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 'లాహోర్లో నేను చూసిన కొన్ని మ్యాచ్ల్లో పాకిస్థాన్ బ్యాటర్లు ఎవరూ కూడా సిక్స్లు కొట్టలేకపోయారు. బంతిని స్టాండ్స్లోకి పంపించలేకపోయారు.
విదేశీ ఆటగాళ్లు మాత్రం అలవోకగా సిక్సర్లు బాదారు. దాంతో పాకిస్థాన్ ఆటగాళ్లంతా ఫిట్గా మారేలా ప్రణాళిక చేయాలని బోర్డును కోరాను. పీఎస్ఎల్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇంగ్లండ్తో ద్వైపాక్షిక సిరీస్లు ఉన్నాయి. జూన్లో టీ20 ప్రపంచకప్ ఉంది. ఫిట్నెస్ క్యాంప్ నిర్వహించేందుకు మాకు సరైన సమయం కూడా లేదు.
అయినా మేం ట్రైనింగ్ క్యాంప్కు కావాల్సిన విండోను గుర్తించాం. కాకుల్ మిలటరీ అకాడమీలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తాం. ఆటగాళ్లకు పాక్ ఆర్మీ అధికారులు సాయం చేస్తారు.'అని నక్వీ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో పాకిస్థాన్ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి ప్రమాణాలు పాటించడంలేదనే విమర్శలు ఉన్నాయి.
ఇక పాక్ ఆటగాళ్లకు ఆర్మీ ట్రైనింగ్ ఇవ్వడంపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. సిక్సర్ల కోసం ఆర్మీ ట్రైనింగ్ ఎందుకని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. క్రికెట్పై కనీస అవగాహన లేని వ్యక్తులను చైర్మెన్లను చేస్తే ఇలానే ఉంటుందని ఎగతాళి చేస్తున్నారు. పాకిస్థాన్ సీనియర్ ఆటగాళ్లు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
విదేశీ టీమ్స్ అనుసరిస్తున్న ఫిట్నెస్ ప్రమాణాలు పాటించాలని, యో యో టెస్ట్తో ఆటగాళ్లు ఫిట్నెస్ను తరుచూ చెక్ చేయాలని సూచిస్తున్నారు. ఆటగాళ్లకు ఆర్మీ ట్రైనింగ్ అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. ఆర్మీ ట్రైనింగ్లో ఆటగాళ్లు తీవ్రంగా గాయపడితే పరిస్థితి ఏందని ప్రశ్నిస్తున్నారు.