బ్యాటింగ్పై ఫోకస్ పెట్టేందుకు..
2014లో మహేంద్రసింగ్ ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీని అందుకున్న విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత 2017లో టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. కానీ.. అతని కెప్టెన్సీలో ఇప్పటి వరకూ కనీసం ఒక్క ఐసీసీ టైటిల్ని కూడా భారత్ జట్టు గెలవలేదు. దాంతో.. గత రెండేళ్ల నుంచి కెప్టెన్సీ విభజనపై చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు బ్యాట్స్మన్గా కూడా కోహ్లీ గత రెండు ఏళ్లుగా విఫలమవుతున్నాడు. మైదానంలోకి దిగితే సెంచరీల మోత మోగించే విరాట్.. గత రెండుళ్లుగా ఒక్క సెంచరీ బాదలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే బ్యాటింగ్పై ఎక్కువ ఫోకస్ చేసేందుకు, మునపటి ఫామ్ అందుకునేందుకు వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు నిజమైతే.. టెస్టు టీమ్ కెప్టెన్గా మాత్రమే కోహ్లీ కొనసాగనున్నాడు.
కెప్టెన్ రోహిత్..
'విరాట్ కోహ్లీనే స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకునే విషయాన్ని వెల్లడించనున్నాడు. బ్యాటింగ్పై మరింత దృష్టిసారించేందుకు అతను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు.'అని కోహ్లీ సన్నిహిత వర్గాలు పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసుకొచ్చింది. ఇక ఈ వార్తలపై రోహిత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మను కెప్టెన్గా చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఇక 2013లో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న హిట్ మ్యాన్ ఐదు టైటిళ్లు అందించాడు. ఇక విరాట్ కోహ్లీ గైర్హాజరీలో భారత జట్టును నడిపించిన రోహిత్.. అద్భుత విజయాలందించాడు. ఈ క్రమంలోనే భారత పరిమిత ఓవర్ల సిరీస్లకు రోహిత్ శర్మను కెప్టెన్గా ఎంచుకోవడం సరైన నిర్ణయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
రోహిత్ ఫ్యాన్స్ సంబరాలు..
'రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఖచ్చితంగా దుమ్మురేపుతోంది. ప్రపంచ క్రికెట్లో మరో స్థాయికి చేరుకుంటుంది.'అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు ఇవ్వడం మంచి నిర్ణయం. గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫైల్కు ఆమోదం లభించింది. హిట్ మ్యాన్ కెప్టెన్సీ.. ధోనీ మెంటార్.. ఐసీసీ ట్రోఫీ భారత్దే.'అని మరో అభిమాని కామెంట్ చేశాడు. రోహిత్కు కెప్టెన్సీ ఇస్తున్నారనే వార్తలతో రోహిత్ అభిమానుల సంతోషాలకు హద్దేలేదనే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. కోహ్లీ, రోహిత్ ఇద్దరికి ఆల్ది బెస్ట్ కూడా చెబుతున్నారు. కొందరు అభిమానులైతే.. ప్రపంచకప్కు ముందే ఈ పని చేయాలని సూచిస్తున్నారు. రోహిత్ను కెప్టెన్ చేస్తేనే భారత్కు టైటిల్ దక్కుతుందని చెబుతున్నారు. మొత్తానికి కోహ్లీ తప్పుకునే రోజు వచ్చేసిందని మరో అభిమాని కామెంట్ చేశాడు.
జూన్లోనే నిర్ణయం..
మరోవైపు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సైతం ఇద్దరి కెప్టెన్ల విధానాన్ని అమలు చేయాలని భావిస్తోందంట. దీనిపై జూలైలో జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్యసమావేశంలోనే చర్చించామని, టీ20 ప్రపంచకప్ తర్వాత అమలు చేయాలని భావించామని బోర్డుకు సంబంధించిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. మరోవైపు ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ బాధ్యతారహిత్యం బోర్డు పెద్దలకు ఆగ్రహం తెప్పించిందని వార్తలు వచ్చాయి. హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి పబ్లిక్ ఈవెంట్కి వెళ్లిన విరాట్ కోహ్లీ.. బయో- సెక్యూర్ బబుల్ రూల్ని బ్రేక్ చేశాడు. దాంతో.. రవిశాస్త్రితో పాటు కోహ్లీని తొలుత వివరణ కోరిన బీసీసీఐ.. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు రద్దుకి ఆ పబ్లిక్ ఈవెంట్ కారణంగా తేలడంతో.. కఠిన చర్యలకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బుక్ లాంచ్కు వెళ్లడంతో..
ఆ పబ్లిక్ ఈవెంట్ తర్వాత ఫస్ట్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్కి ఈ మహమ్మారి సోకింది. దాంతో.. ఐదో టెస్టు కోసం మైదానంలోకి వచ్చేందుకు భారత క్రికెటర్లు నిరాకరించగా.. మ్యాచ్ను ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రద్దు చేసింది. ఆ మ్యాచ్ రద్దుతో ఈసీబీ నష్టపోయిన మొత్తం సుమారు రూ.40 కోట్లు. ఈ మొత్తం వ్యవహారం.. బీసీసీఐ, ఈసీబీ మధ్య సత్సంబంధాలని దెబ్బతీస్తోంది.
తప్పించకముందే..
బీసీసీఐ పెద్దలకి విరాట్ కోహ్లీ ఇలా ఆగ్రహం తెప్పించడం ఇదేమీ తొలిసారి కాదు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడం వెనుక కోహ్లీ పాత్ర కూడా ఉన్నట్లు అప్పట్లో వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య కూడా డ్రెస్సింగ్ రూములో గొడవ జరిగిందని అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా తుది జట్టు ఎంపిక విషయంలో కోహ్లీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడనే అభిప్రాయాలు వినిపించాయి. మరీ ముఖ్యంగా.. ఈ ఏడాది జూన్లో న్యూజిలాండ్తో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇద్దరు స్పిన్నర్ (అశ్విన్, జడేజా)తో బరిలోకి దిగిన భారత్ జట్టు ఓడిపోయింది. పేస్కు అనుకూలించే సౌథాంప్టన్ పిచ్పై కోహ్లీ ఇద్దరు స్పిన్నర్లను తుది జట్టులో ఎంచుకోవడంపై బీసీసీఐ పెద్దలు, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గౌరవంగా బాధ్యతలను వదులుకోవాలని విరాట్ కోహ్లీ భావించి ఉంటాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications
