అసలేం జరిగిందంటే..?
ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా రవి బిష్ణోయ్ వేసిన 8వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బిష్ణోయ్ వేసిన మూడో బంతిని పడిక్కల్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతిని అంచనా వేయడంలో పడిక్కల్ విఫలమయ్యాడు. దాంతో బంతి బ్యాట్ను మిస్సయి కీపర్ రాహుల్ చేతిలో పడింది. పడిక్కల్ గ్లౌజ్కు తాకడంతో పాటు సౌండ్ రావడంతో పంజాబ్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. అయితే ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దాంతో రాహుల్.. వెంటనే రివ్యూ కోరాడు.
రాహుల్ వాగ్వాదం..
టీవీ రిప్లేలో పలు మార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ కే శ్రీనివాసన్ నాటౌట్గా తేల్చాడు. అయితే బంతి గ్లౌజ్ను ధాటే క్రమంలో స్నీకో మీటర్లో స్పైక్స్ కనిపించాయి. కానీ థర్డ్ అంపైర్ మాత్రం స్పైక్స్ పెద్దగా లేవని నాటౌట్ ఇచ్చాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాహుల్, ఇతర పంజాబ్ ఆటగాళ్లు.. అంపైర్ పద్మనాభన్తో వాగ్వాదానికి దిగారు. స్నికో మీటర్లో స్పైక్ కనిపించింది కదా? ఎందుకు నాటౌట్ ఇచ్చారని నిలదీశారు. దీనికి అనంత పద్మనాభన్ సమాధానం చెప్పినా రాహుల్ సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా అతనితో కూడా ఈ విషయం మాట్లాడుతూ రాహుల్ అసహనం వ్యక్తం చేశాడు.
కళ్లు దొబ్బాయా?
స్నీకో మీటర్లో అంత స్పష్టంగా బంతి.. పడిక్కల్ గ్లోవ్స్ను తాకుతున్నట్లు కనబడినా అంపైర్ నాటౌట్ ఇవ్వడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు సైతం థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, స్కాట్ స్టైరీస్లు ట్విటర్ వేదికగా థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈరోజుల్లో ఇలాంటి తప్పిదాలు చేయడం ఘోరమని శ్రీకాంత్ ట్వీట్ చేయగా.. వెంటనే థర్డ్ అంపైర్పై వేటు వేయాలని స్కాట్ స్టైరీస్ ట్వీట్ చేశాడు. అభిమానులు సైతం ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాక్సీ మెరుపులు..
గ్లేన్ మ్యాక్స్వెల్(33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీకి దేవదత్ పడిక్కల్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 40) క్లాస్ ఇన్నింగ్స్ తోడవడంతో పంజాబ్ కింగ్స్ ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 165 పరుగలు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. మ్యాక్సీ, పడిక్కల్తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 25), ఏబీ డివిలియర్స్(18 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లతో 23) రాణించారు. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమీ(3/39), మోయిసెస్ హెన్రీక్స్(3/12) మూడేసి వికెట్లు తీశారు.


Click it and Unblock the Notifications












