
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ ఫస్ట్ మ్యాచ్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగిన తుది జట్టుపై అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువ పేసర్ చేతన్ సకారియాను ఆడించకపోవడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. పేసర్లు ఖలీల్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కమలేశ్ నాగర్కోటి, స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్లతో ఢిల్లీ బరిలోకి దిగింది.
గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన చేతన్ సకారియా ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో ఉంటాడని అంతా భావించినా.. మేనేజ్మెంట్ అతనికి అవకాశం ఇవ్వలేదు. అతన్ని కాదని ఖలీల్ అహ్మద్ను తీసుకుంది. రూ.4.20 కోట్ల భారీ ధరకు చేతన్ సకారియాను కొనుగోలు చేసిన ఢిల్లీ తుది జట్టులో ఆడించకపోవడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. గతేడాది అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడని, మంచి ఫీల్డర్ కూడా అని గుర్తు చేస్తున్నారు.
ఇది బుద్ది తక్కువ నిర్ణయమని ఢిల్లీ మేనేజ్మెంట్పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. నాగర్కోటి బదులు చేతన్ సకారియాను ఆడించాల్సిందంటున్నారు. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్లో సెంచరీలతో దుమ్మురేపిన సర్ఫరాజ్ ఖాన్ను తీసుకుపోవడాన్ని కూడా తప్పుబడుతున్నారు. అసలు చేతన్ సకారియాను ఎందుకు ఆడించడం లేదని మరో నెటిజన్ నిలదీసాడు. మ్యాచ్ విషయానికి వస్తే 15 ఓవర్లు ముగిసే సరికి ముంబై..3 వికెట్లకు 117 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(45 బ్యాటింగ్), కీరన్ పొలార్డ్(0 బ్యాటింగ్) ఉన్నారు. రోహిత్ శర్మ(41), తిలక్ వర్మ(22) రాణించగా.. అన్మోల్ ప్రీత్ సింగ్(8) విఫలమయ్యాడు.