అభిమానం తలకెక్కితే.. ఇలాగే ఉంటుందేమో..! తమ పిచ్చిని దేవుడికి కూడా ఆపాదిస్తూ చేసిన పనులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా విగ్రహాల ఏర్పాటు విషయంలో నిర్వాహకులు సహజంగానే తమ ప్రత్యేకత చాటుకోవాలనుకుంటారు. భారీ ఎత్తులో ఉన్న విగ్రహాలను పెట్టడం, కళ్లు చెదిరే డెకరేషన్స్ చేయడం.. టెంపుల్ సెట్స్ వేయడం వంటి పనులు చేస్తారు. కానీ కొందరు నిర్వాహకులు మరో అడుగు ముందుకేసి వినాయక మండపాల ఏర్పాట్లలోనూ తమ అభిమానాన్ని చూపెడుతున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోలికతో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహంపై సర్వత్రా విమర్శలు రావడంతో నిర్వాహకులు దాన్ని తొలగించి మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలానే దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినిమా, క్రికెట్ సెలెబ్రిటీలపై ఉన్న అభిమానంతో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారాయి.

కర్నాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో ఆర్సీబీ థీమ్ వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. ఆర్సీబీ జెర్సీలో ఉన్న వినాయకుడు ఐపీఎల్ 2025 టైటిల్ నెత్తిన పెట్టుకున్నట్లుగా విగ్రహాన్ని తయారు చేశారు. కర్ణాటకలో ఏర్పాటు చేసిన మండపంలో అయితే 11 మంది వినాయకులు క్రికెట్ ఆడుతూ ఉండుగా.. అందులోని ఒక గణనాథుడు టైటిల్ ఎత్తుకొని చూపిస్తున్నట్లుగా ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో ఆయనను పోలీ ఉన్న విగ్రహాలు, ఆపరేషన్ సిందూర్, పుష్ప వంటి కాన్సెప్ట్లతో మండపాలు ఏర్పాటు చేశారు. ఈ వినాయక మండపాలు వినూత్నంగా కనిపిస్తున్నా.. భక్తులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తమ అభిమానాన్ని చాటుకునేందుకు దేవుడిని వాడుకోవడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. భక్తి, శ్రద్దల కంటే ఎంజాయ్మెంట్ కోసం వినాయక చవితిని ఉపయోగించుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరైతే.. 'రేయ్ ఎవర్రా మీరంతా.. ఇలా ఉన్నారు..!' సెటైర్లు పేల్చుతున్నారు.