Syed Mushtaq Ali Trophy 2023 ట్రోఫీలో సన్రైజర్స్ హైదరాబాద్ యువ బౌలర్ కార్తీక్ త్యాగి దుమ్మురేపుతున్నాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కార్తీక్ త్యాగీ.. మంగళవారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సంచలన ప్రదర్శన కనబర్చాడు. గంటకు 150 కిలోమీటర్లతో నిలకడగా బౌలింగ్ చేసిన కార్తీక్ త్యాగీ.. ఓ బంతిని ఏకంగా 161 కిలోమీటర్ల వేగంతో వేసాడు.
ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారింది. కార్తీక్ త్యాగి ఫాస్టెస్ట్ బౌలింగ్కు నెటిజన్లు విస్తుపోతున్నారు. అయితే టెక్నికల్ గ్లిట్చ్తో ఇలా చూపించారా? లేక 161 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసాడా? అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ ఇన్నింగ్స్ సందర్భంగా 16వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ వేసిన కార్తీక్ త్యాగి.. మొదటి రెండు బంతులను 147 కిలోమీటర్లు, 157 కిలోమీటర్ల వేగంతో విసిరినట్లు టీవీలో చూపించారు. ఇక మూడో బంతి ఏకంగా 161 కిలోమీటర్ల వేగంతో విసిరినట్లు బ్రాడ్ కాస్టర్లు చూపించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది టీమిండియా నయా పేస్ గన్ అంటూ కొనియాడుతుండగా.. మరికొంతమంది మాత్రం సాంకేతిక సమస్యతో అలా చూపించిందేమో అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇక కార్తీక్ త్యాగి వేసిన ఓ బంతి వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లా హెల్మెట్కు బలంగా తాకింది. దాంతో అతను నెత్తి పట్టుకొని ఇబ్బంది పడ్డాడు. యూపీకి చెందిన కార్తీక్ త్యాగి.. ఐపీఎల్లో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఐపీఎల్ 2023 సీజన్లో అతనికి తగిన అవకాశాలు దక్కలేదు.
యూపీ తరుఫున దేశవాలీ క్రికెట్ ఆడుతున్న త్యాగి.. 2020-21లో భారత ప్లేయర్లతో పాటు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. టీమిండియా నెట్బౌలర్గా సేవలందించాడు. గత సీజన్ ముందు వరకు రాజస్థాన్ రాయల్స్కు ఆడిన త్యాగిని.. ఐపీఎల్ 2023 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. యూపీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా.. కార్తీక్ త్యాగికి ఒక వికెట్ తీసాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన యూపీ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.