టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ బ్యాటర్ సురేశ్ రైనా చిక్కుల్లో పడ్డారు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ నెగ్గిన జోష్లో ఈ ముగ్గురు చేసిన ఓ వీడియోపై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం మొత్తం హీరోలుగా పరిగణించే వ్యక్తులు ఇంతలా దిగజారుతారా? అని మండిపడుతున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ గెలిచిన అనంతరం యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా.. బాలీవుడ్ మూవీ 'బ్యాడ్ న్యూస్'లోని తౌబా తౌబా హుక్ స్టెప్ను ఇమిటేట్ చేస్తూ రీల్ చేశారు. ఇందులో వారు నడుము పట్టుకుని, కుంటుకుంటూ నడుస్తూ కనిపించారు.

ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. '15 రోజుల లెజెండ్స్ క్రికెట్ తర్వాత మా శరీరాలు కూడా తౌబా తౌబా అయ్యాయి. శరీరంలో ప్రతీ అవయవం నొప్పిగా ఉంది. ఇది మా వెర్షన్ 'తౌబా తౌబా' అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, కరణ్కు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
దీనిపై అభిమానులు సానుకూలంగా కామెంట్లు చేయగా.. దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శిస్తున్నారు. 'దేశం మొత్తం హీరోలుగా పరిగణించే వ్యక్తుల నుంచి ఇలాంటి అమర్యాదకర ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ఎంతోమందికి ఆదర్శంగా ఉండాల్సిన వారు దివ్యాంగులను ఎగతాళి చేస్తున్నారు. ఇది చాలా సిగ్గు చేటు. దీనిపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలి'నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ డిమాండ్ చేశారు.