అసలేం జరిగిందంటే..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. హాఫ్ సెంచరీ వరకు నిదానంగా ఆడిన హిట్ మ్యాన్ ఆ తర్వాత తన జోరును పెంచాడు. తనదైన షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే హిట్మ్యాన్ సెంచరీ కోసం భారత అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే రోహిత్ 81 పరుగుల వద్ద ఉన్న సమయంలో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న సంజయ్ మంజ్రేకర్.. అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. హిట్మ్యాన్ కచ్చితంగా శతకం సాధిస్తాడని మంజ్రేకర్ కామెంట్ చేసిన మరుక్షణమే.. జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అండర్సన్ వేసిన ఇన్ స్వింగర్ బాల్ను డిఫెన్స్ చేసే క్రమంలో రోహిత్ లైన్ మిస్సయ్యాడు. దాంతో బంతి వికెట్లను తాకేసింది.
అప్పటివరకు రోహిత్ సెంచరీ చేస్తాడని ఆశగా ఎదురుచూసిన భారత అభిమానులు నిరాశకు గురయ్యారు. దీంతో మంజ్రేకర్ వల్లనే రోహిత్ ఔట్ అయ్యాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పుజారా సైతం..
ఇక చతేశ్వర్ పుజారా సైతం మంజ్రేకర్ వ్యాఖ్యనం వల్లనే ఔటయ్యాడని ఆరోపిస్తున్నారు. స్ట్రైట్ డ్రైవ్ ఆడాడని పుజారాను మెచ్చుకున్న మరుక్షణమే స్లిప్ క్యాచ్గా వెనుదిరిగాడని గుర్తు చేస్తున్నారు. భారత బ్యాట్స్మన్ వైఫల్యానికి మంజ్రేకర్ కామెంట్రీనే కారణమంటున్నారు. బీసీసీఐ వెంటనే అతన్ని కామెంటేటర్గా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ పరంగా రోహిత్ వికెట్ తీసింది అండర్సన్ అయితే... భారత్ పరంగా మంజ్రేకరని సెటైర్లు పేల్చుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట హల్చల్ చేస్తోంది. వాస్తవానికి మంజ్రేకర్ను బీసీసీఐ కామెంట్రీ ప్యానల్ను తొలగించారు. దాంతోనే స్టార్ స్పోర్ట్స్ కాకుండా ఇతర చానెల్స్లో, విదేశీ పర్యటనలకు మాత్రమే అతను కామెంటేటర్గా వ్యవహరిస్తున్నారు.
ఎప్పుడూ వివాదాస్పదమే..
మంజ్రేకర్ కామెంట్రీ, అతను చేసే పనులన్నీ వివాదానికి దారితీస్తుంటాయి. గతంలో అనేకమంది ఆటగాళ్లను కించపరిచేలా మాట్లాడి వారి చివాట్లు తిన్నాడు. జడేజా-మంజ్రేకర్ మధ్య అయితే పెద్ద మాటల యుద్దమే నడిచింది. ఇప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా మంజ్రేకర్పై జడేజా.. జడేజాపై మంజ్రేకర్ కామెంట్ చేస్తూనే ఉంటారు. తాజాగా రెండో టెస్ట్కు టీమ్ను ప్రకటించిన మంజ్రేకర్ అందులో జడేజాను విస్మరించాడు. ఫస్ట్ టెస్ట్లో హాఫ్ సెంచరీతో భారత్ను గట్టెక్కించిన అతని పక్కన పెట్టడంపై తీవ్రవిమర్శలు వచ్చాయి. ఇది కచ్చితంగా ప్రతీకారమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వన్డే ప్రపంచకప్ నుంచీ..
2019 వన్డే ప్రపంచకప్ నుంచి సంజయ్ మంజ్రేకర్, రవీంద్ర జడేజాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. జడేజా ఓ బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్ అని మెగా టోర్నీ సందర్భంగా మంజ్రేకర్ విమర్శించాడు. 'నేను అరకొర ఆటగాళ్లని పెద్దగా అభిమానించను. వన్డేల్లో రవీంద్ర జడేజా ఇప్పుడు ఆ కోవకి చెందిన ప్లేయర్. టెస్టుల్లో జడేజా మంచి బౌలర్. కానీ వన్డేల్లో అతను బ్యాట్స్మెన్ కాదు. అలా అని బౌలర్ కూడా కాదు' అని జడేజాను తేలిక చేసి మాట్లాడాడు. ఇందుకు జడేజా ఘాటుగా స్పందించాడు. 'మంజ్రేకర్ నీ కెరీర్లో నువ్వు ఆడిన మ్యాచ్ల కంటే రెట్టింపు మ్యాచ్లను నేను ఆడాను. ఇప్పటికీ ఆడుతున్నాను. ఏదైనా సాధించిన వారిని గౌరవించడం నేర్చుకో. ఇకనైనా నీ నోటి విరోచనాలు ఆపు' అని జడేజా ఫైర్ అయ్యాడు. సహచర కామెంటేర్ హర్షా భోగ్లే పట్ల కూడా మంజ్రేకర్ అనుచితంగా ప్రవర్తించాడు. దాంతో అతనిపై వేటు వేస్తూ బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది.


Click it and Unblock the Notifications
