
సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో మళ్లీ డీఆర్ఎస్ వ్యవహారం వివాదాస్పదమైంది. భారత్ ఇన్నింగ్స్ సందర్బంగా చతేశ్వర్ పుజారా ఔట్ విషయంలో డీఆర్ఎస్కు వెళ్లిన ఆసీస్ కెప్టెన్ టీమ్పైన్ అంపైర్తో వాగ్వాదం దిగాడు. సహనం కోల్పోయి అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ వ్యవహారమే తీవ్ర చర్చనీయాంశం కాగా.. తాజాగా భారత కెప్టెన్ అజింక్యా రహానే తీసుకున్న డీఆర్ఎస్ కూడా వివాదాస్పదమైంది.
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 12వ ఓవర్లో అశ్విన్ వేసిన బంతిని స్వీప్ షాట్ ఆడబోయిన స్మిత్ బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దాంతో బంతి స్మిత్ ప్యాడ్లకు తాకింది. ఎల్బీ కోసం భారత ఆటగాళ్లు అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. అయితే ఇది వికేటేనని గట్టిగా నమ్మిన అశ్విన్.. రహానే సాయంతో రివ్యూకెళ్లాడు.
పలు కోణాల్లో హాక్-ఐ టెక్నాలజీతో పరిశీలించిన థర్డ్ అంపైర్.. అంపైర్ కాల్స్గా తేల్చి నాటౌట్ ఇచ్చాడు.
అయితే ఈ హాక్-ఐ టెక్నాలజీ చూపించిన ప్రొజెక్షన్లో తప్పును ఓ క్రికెట్ అభిమాని ఎత్తిచూపాడు. ప్రొజెక్షన్లో వికెట్లు ఉండే పొజిషన్ వేరుగా ఉందని, నాలుగు వికెట్లు కనిపిస్తున్నాయని తెలిపాడు. బంతి లెగ్ వికెట్కు దూరంగా వెళ్లిందని, కానీ ప్రొజెక్షన్లో మాత్రం లెగ్ స్టంప్కు తాకినట్లు చూపించిందని పేర్కొన్నాడు. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు కాబట్టి స్మిత్ బతికిపోయాడని లేకుంటే టెక్నాలజీ తప్పిదానికి బలయ్యేవాడని కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు.. తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. అంపైర్లు తప్పిదాలు చేస్తున్నారని డీఆర్ఎస్కు వెళ్లితే.. టెక్నాలజీ కూడా తప్పులు చేస్తే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఉంటే అసలు ఈ టెక్నాలజీని ఎలా నమ్మాలని కామెంట్ చేస్తున్నారు.
శనివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఓపెనర్లు విల్ పుకోస్కీ(10), డేవిడ్ వార్నర్ (13) తీవ్రంగా నిరాశ పర్చగా.. మార్నస్ లబుషేన్(47 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్(29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి ఆసీస్ 197 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు 96/2 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా(50) మినహా ఇతర బ్యాట్స్మెన్ దారుణంగా విఫలమయ్యారు.