
ఆమ్స్టర్డామ్: ఎక్కడి గత్తరనో ఏమో కానీ ఈ కరోనా తెచ్చిన కష్టం అంత ఇంత కాదు. ఈ మహమ్మారి ప్రభావానికి గురికానీ వ్యక్తి ఈ భూమి మీదనే లేడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అగ్ర రాజ్యం నుంచి ఆకలి రాజ్యం వరకు.. సంపన్నుల నుంచి నిరు పేదల వరకు ఈ గత్తరకు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానే ప్రభావమైనవాళ్లే. ఈ ప్రాణాంతక మహమ్మారి ప్రజల జీవితాల్ని చిన్నాభిన్నం చేసింది. ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీసింది. ముఖ్యంగా టూరిజం, సినీ, మీడియా, క్రీడా రంగాలు పూర్తిగా కుదేలయ్యాయి.
మహమ్మారి ధాటికి ఒలింపిక్స్, టీ20 ప్రపంచకప్తో సహా మెగా క్రీడా టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. అయితే, కరోనా వైరస్ తన జీవితాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో వెల్లడిస్తూ నెదర్లాండ్స్ క్రికెటర్ పాల్ వాన్ మీకెరెన్ ట్విటర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు. దేశం తరఫున ప్రపంచకప్లో ప్రాతినిధ్యం వహించాల్సిన తాను ప్రస్తుతం పూట గడవడం కోసం డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాని వెల్లడించాడు.
ఈ కరోనానే లేకుంటే షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా ఈ పాటికి టీ20 ప్రపంచకప్ జరిగి ముగిసేది. కానీ మహమ్మారి కారణంగా ప్రపంచకప్ను వాయిదా వేశారు. కరోనా లేకపోతే మెల్బోర్న్ మైదానంలో ఫైనల్ను వీక్షించేవారిమని ఈఎస్పీన్ క్రిక్ఇన్ఫో ఆదివారం ట్వీట్ చేసింది. దీన్ని రీట్వీట్ చేసిన వాల్ వాన్ 'ఈ రోజు క్రికెట్ ఆడుతూ ఉండాల్సింది. కానీ, ప్రస్తుతం శీతకాలం నెలల్ని గడిపేందుకు ఉబర్ ఈట్స్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాన. విధి ఎంతో విచిత్రమైనది. పరిస్థితుల్ని మార్చేస్తుంది. అయినా నవ్వుతూ మనం ముందుకు సాగిపోవాలి' అని ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్గా మారింది. ప్రతికూలతలను అధిగమించి తిరిగి క్రికెట్ ఆడతావని నెటిజన్లు అతడికి ధైర్యం చెబుతున్నారు. పరిస్థితులకు తలొంచకుండా పోరాడుతున్న అతనికి సెల్యూట్ చేస్తున్నారు. ఎందరో ఆటగాళ్లకి స్పూర్తిగా నిలుస్తున్నావని ప్రశంసిస్తున్నారు. నెదర్లాండ్స్ జట్టులో కీలక బౌలర్ అయిన పాల్ వాన్ 2013లో కెన్యాతో జరిగిన టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. వాన్ ఇప్పటివరకు 5 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. పొట్టిఫార్మాట్లో అతను 47 వికెట్లు సాధించాడు. ఇక భారత్ వేదికగా జరగనున్న 2021 టీ20 ప్రపంచకప్లో నెదర్లాండ్స్ బరిలోకి దిగనుంది.