
ఖాఠ్మాండు: నెపాల్కు చెందిన అంతర్జాతీయ క్రికెటర్ లలిత్ బండారి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం నేపాల్, జాలరి మార్కెట్ సమీపంలోని ఈస్ట్-వెస్ట్ హైవేలో బంధువుతో కలిసి వెళ్తున్న లలిత్ బైక్ ప్రమాదవశాత్తు ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లలిత్ తీవ్రంగా గాయపడగా.. అతని బంధువుకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అతన్ని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. లలిత్ కుడి భుజం, నడుము భాగాల్లో గాయాలైనట్లు అతని బంధువు రామ్ సింగ్ ఖత్రి ఒకరు మీడియాకు తెలిపారు.
ప్రమాదం జరగిన షాక్తో అతను స్పృహ కోల్పోయాడని, ఆసుపత్రి తీసుకువెళ్లే సమయంలో మాత్రం మూలిగాడని తెలిపాడు. ఈ ప్రమాద ఘటనపై నేపాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా స్పందించింది. యువ క్రికెటర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అలాగే అతని పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని వరుస ట్వీట్లలో పేర్కొంది.
'నేపాల్లోని కంచనపూర్కు చెందిన లలిత్ బండారి.. వ్యక్తిగత పనుల మీదుగా మహేంద్ర నగర్ నుంచి ధంగధి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతని తలకు ఎలాంటి గాయాలు కాలేదని, చేతులు, పాదాలకు మాత్రం చిన్న చిన్న గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం అతన్ని ఖోలాపుర్ మెడికల్ కాలేజ్కు తరలించారు. అతని వైద్య చికిత్సను క్రికెట్ అధికారులు పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది'అని ఆ ట్వీట్లలో పేర్కొంది.
లెఫ్టార్మ్ పేసర్ అయిన 24 ఏళ్ల లలిత్ బండారి 2018లో నెపాల్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. నెథర్లాండ్స్తో జరిగి ఆ మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అంతగా అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. లిస్ట్-ఏ, టీ20 క్రికెట్ మాత్రం ఆడాడు. ఐకానిక్ లార్డ్స్ మైదానం వేదికగా మెరిలిన్ క్రికెట్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో నేపాల్ తరఫున బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్లో వికెట్ తీయకపోయినప్పటికీ.. ఒకే ఓవర్ వేసి కేవలం 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అలాగే నేపాల్ పోలిస్ క్లబ్ తరఫున డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడాడు.