అత్యాచారం కేసులో దోషిగా తేలిన నేపాల్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సందీప్ లామిచానేపై ఆ దేశ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. అన్ని రకాల క్రికెట్ ఆడకుండా సస్పెన్షన్ విధిస్తూ చర్యలు తీసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులోసందీప్ లామిచానేకు 8 ఏళ్ల శిక్షను ఖరారు చేస్తూ స్థానిక ఖాట్మండు జిల్లా కోర్టు తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా రూ 3 లక్షల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ. 2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. రెండేళ్ల క్రితం(2022) నేపాల్, తిల్గంగాలోని ఒక హోటల్లో సందీప్ లామిచానే తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

అనంతరం అతను బెయిల్పై విడుదలయ్యాడు. ఆరోపణలు వచ్చిన సమయంలో నేపాల్ క్రికెట్ బోర్డు అతనిపై నిషేధం విధించింది. ఆ తర్వాత అతనికి బెయిల్ ఇవ్వడంతో తమ సస్పెన్షన్ ఎత్తేసింది. ఈ కేసులో మొదట బాధితురాలు తాను మైనర్నని ఆరోపించినప్పటికీ.. న్యాయ స్థానం మైనర్ కాదని తేల్చింది.
గతేడాది డిసెంబర్లోనే సందీప్ను దోషిగా తేల్చిన ఖాట్మండు జిల్లా కోర్టు బుధవారం తుది తీర్పునిచ్చింది. ఇప్పటికే అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు కూడా వెల్లడించింది. ఈ తీర్పును హై కోర్టులో సవాల్ చేస్తామని సందీప్ లామిచానే తరఫు న్యాయవాది తెలిపారు. సందీప్పై కుట్రపూరితంగా ఈ కేసు పెట్టారని ఆరోపించారు.
2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సందీప్ లమిచానే.. నేపాల్ జట్టు సారథిగా కూడా వ్యవహరించాడు. నేపాల్ తరఫున ఇప్పటి వరకు 52 టీ20లు ఆడి 98 వికెట్లు తీసాడు. ఓవరాల్గా పొట్టి ఫార్మాట్లో 75 మ్యాచ్ల్లో 158 వికెట్లు తీసాడు. నేపాల్ తరఫున ఐపీఎల్ ఆడిన తొలి ప్లేయర్ కూడా సందీప్ లామిచానే. 2018-20 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్కు అతను ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 9 మ్యాచ్లు ఆడిన అతను 13 వికెట్లు తీసాడు.