ముల్తాన్: పేలవ బ్యాటింగ్, పసలేని బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ పాకిస్థాన్ చేతిలో తమ ఘోర పరాజయానికి కారణాలయ్యాయని నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ తెలిపాడు. ఈ మ్యాచ్ తమ జట్టుకు ఓ గుణపాఠమని అభిప్రాయపడ్డాడు. ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్తో బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో నేపాల్ 238 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
ఆసియాకప్కు తొలిసారి అర్హత సాధించిన నేపాల్.. పాకిస్థాన్కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. బంతితో ఆరంభంలో అదరగొట్టినా.. ఆ తర్వాత చెత్త ఫీల్డింగ్తో మూల్యం చెల్లించుకుంది. బాబార్ ఆజామ్ ఇచ్చిన సునాయస క్యాచ్ను నేలపాలు చేయడం నేపాల్ పతనాన్ని శాసించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన నేపాల్ సారథి.. తమ జట్టు చాలా విషయాల్లో మెరుగవ్వాలని అంగీకరించాడు.

'మేం బంతితో శుభారంభాన్ని అందుకున్నాం. కానీ బాబర్ ఆజామ్, ఇఫ్తికర్ అహ్మాద్ అసాధారణ బ్యాటింగ్తో మ్యాచ్ను లాగేసుకున్నారు. ఈ టోర్నీకి ముందు మేం అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాం. కానీ ఈ రోజు మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయాం. మిడిల్ ఓవర్లలో వికెట్ టేకింగ్ బాల్స్ వేయాలేకపోయాం.
ఈ విజయం క్రెడిట్ పూర్తిగా బాబర్ ఆజామ్దే. అతను అసాధారణంగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. మా డెత్ బౌలింగ్ను మెరుగుపరుచుకోవాల్సి ఉంది. బ్యాటింగ్ విషయంలోనూ సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది.'అని రోహిత్ పౌడెల్ అభిప్రాయపడ్డాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 342 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్లతో 151), ఇఫ్తికర్ అహ్మద్(71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 109 నాటౌట్) సెంచరీలతో చెలరేగగా.. మహమ్మద్ రిజ్వాన్(50 బంతుల్లో 6 ఫోర్లతో 44) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

నేపాల్ బౌలర్లలో సోంపాల్ కమీ రెండు వికెట్లు తీయగా.. కరణ్ కేసీ, సందీప్ లామిచ్చనే తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన నేపాల్ 23.4 ఓవర్లలో 104 పరుగులకు కుప్పకూలింది. షాదాబ్ ఖాన్(4/27) నాలుగు వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించాడు. షాహిన్ షా అఫ్రిది(2/27), హ్యారీస్ రౌఫ్(2/16), రెండేసి వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీసారు.
నేపాల్ బ్యాటర్లలో ఆరిఫ్ షేక్(26), సోంపాల్ కమీ(28), గుల్సాన్ జా(13) డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. నేపాల్ ఇన్నింగ్స్లో ముగ్గురు బ్యాటర్లు డకౌటవ్వడం గమనార్హం.