భారత స్టార్ జావెలిన్ త్రోయర్, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రాదేశిక సైన్యం(టెరిటోరియల్ ఆర్మీ).. ఈ బళ్లెం వీరుడికి లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను ప్రదానం చేసింది. ఈ విషయాన్ని భారత రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ హోదా ఏప్రిల్ 16, 2025 నుంచి అమల్లోకి వస్తుందని తమ ప్రకటనలో తెలిపింది. నీరజ్ చోప్రా గతంలో భారత సైన్యంలో సుబేదార్గా పనిచేశాడు.
టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించి ఈ ఘనతను అందుకున్న తొలి భారత అథ్లెట్గా నీరజ్ చోప్రా చరిత్రకెక్కిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శన నేపథ్యంలో నీరజ్ చోప్రాను భారత ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. 'పరమ విశిష్ట సేవా పతకం'తో సత్కరించింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న్ అవార్డును 2021లో ప్రదానం చేసింది. 2022లో నీరజ్ చోప్రాకు పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది.

పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలోనే రెండు మెడల్స్ సాధించిన భారత అథ్లెట్గాను నీరజ్ చోప్రా రికార్డ్ సాధించాడు. నీరజ్ చోప్రా కంటే ముందు మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్, సచిన్ పైలెట్, అనురాగ్ ఠాకూర్, అభినవ్ బింద్రా.. ప్రాదేశిక సైన్యంలో గౌరవ హోదాను పొందారు. ప్రాదేశిక సైన్యం అనేది స్వచ్ఛంద పౌరులతో కూడిన సైనిక సంస్థ, వీరు దేశానికి అవసరమైనప్పుడు సేవ చేయడానికి శిక్షణ పొందుతారు.
ఆపరేషన్ పరాక్రమ్, కార్గిల్ యుద్ద సమయంలోనూ ప్రాదేశిక సైన్యం.. భారత సైనిక దళానికి సేవలు అందించింది. పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రాదేశిక సైన్యంలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. నీరజ్ చోప్రా మే 16న దోహా డైమండ్ లీగ్, జూన్ 24న ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ 2025 అథ్లెటిక్స్ మీట్లో పోటీపడనున్నాడు.