లక్నో: వన్డే ప్రపంచకప్ 2023లో తమ పరాజయాల పరంపరకు శ్రీలంక బ్రేక్ వేసింది. మూడు వరుస ఓటముల తర్వాత శ్రీలంక తొలి విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అనేక మలుపులు తిరిగిన ఈ మ్యాచ్లో చివరకు విజయం శ్రీలంకకే దక్కింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. సైబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్(82 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 70), లోగన్ వాన్ బీక్(75 బంతుల్లో ఫోర్, సిక్స్తో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు.

91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగిన నెదర్లాండ్స్ను సైబ్రాండ్-వాన్ బీక్ 129 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక(4/49), కాసున్ రజితా(4/50) నాలుగేసి వికెట్లతో సత్తా చాటగా.. మహీష్ తీక్షణ(1/44) ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 48.2 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు చేసి గెలుపొందింది. సదీర సమర విక్రమా(107 బంతుల్లో 7 ఫోర్లతో 91 నాటౌట్) , పాతుమ్ నిస్సంక(52 బంతుల్లో 9 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. చరిత్ అసలంక(66 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 44), ధనంజయ డిసిల్వా(37 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 30) కీలక ఇన్నింగ్స్ ఆడారు. దుషన్ హేమంత్(4 నాటౌట్) విన్నింగ్ షాట్తో శ్రీలంక విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్(3/44) మూడు వికెట్లు తీయగా.. పాల్ వాన్(1/39), కోలిన్ అకెర్మన్(1/39) తలో వికెట్ పడగొట్టారు.అజేయ హాఫ్ సెంచరీతో శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన సదీర సమరవిక్రమాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ గెలుపుతో శ్రీలంక పాయింట్స్ టేబుల్లో ఓ స్థానాన్ని మెరుగు పరుచుకోగా.. అఫ్గానిస్థాన్ అట్టడుగు స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్, ఇండియా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్లో ఓడినా.. నెదర్లాండ్స్ అద్భుత పోరాటపటిమ కనబర్చింది.