ఇంగ్లండ్తో రెండో టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. ముందుగా బ్యాటింగ్లో భారీ స్కోర్ నమోదు చేసిన టీమిండియా.. అనంతరం అద్భుతమైన బౌలింగ్తో ఇంగ్లండ్ టాప్-3 బ్యాటర్లను పెవిలియన్ చేర్చింది. క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్(30 బ్యాటింగ్), జో రూట్(18 బ్యాటింగ్) ఆచితూచి ఆడటంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్.. తమ బజ్బాల్ గేమ్ను పక్కన పెట్టి జిడ్డు బ్యాటింగ్తో అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్ ఆడింది.
అంతకుముందు 310/5 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. శుభ్మన్ గిల్(387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్లతో 269) రికార్డ్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా(137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 89), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 13 ఫోర్లతో 87) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. వాషింగ్టన్ సుందర్(103 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(3/167) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/81), జోష్ టంగ్(2/119) రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ తీసారు.

జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు జోడించిన శుభ్మన్ గిల్.. వాషింగ్టన్ సుందర్తో కలిసి ఏడో వికెట్కు 144 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. దాంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా మారడంతో భారత బ్యాటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేశారు. శుభ్మన్ గిల్ ఔటైన అనంతరం 13 పరుగుల వ్యవధిలోనే భారత్ చివరి రెండు వికెట్లు కోల్పోయింది. తొలి రెండు సెషన్లలో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్.. మూడో సెషన్ ఆరంభంలో కాస్త తడబడింది.
ఆ తర్వాత బౌలింగ్లో రాణించి పై చేయి సాధించింది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై కొత్త బంతితో ఆకాశ్ దీప్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో బెన్ డకెట్(0), ఓలీ పోప్(0)ను డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. దూకుడుగా ఆడిన జాక్ క్రాలీని సిరాజ్ ఔట్ చేశాడు. ఈ ముగ్గురు బ్యాటర్లు స్లిప్ ఫీల్డర్లకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. తొలి టెస్ట్లో ఐదు క్యాచ్లు వదిలేసిన యశస్వి జైస్వాల్ను స్లిప్ ఫీల్డింగ్కు దూరంగా ఉంచారు. ఇంగ్లండ్ ఇంకా 510 పరుగుల వెనుకంజలో ఉంది.