బెంగళూరు: పరిమిత ఓవర్ల కెప్టెన్గా, టెస్ట్ వైస్ కెప్టెన్గా డబుల్ ప్రమోషన్ అందుకున్న రోహిత్ శర్మకు అంతలోనే దురదృష్టం వెంటాడింది. సౌతాఫ్రికా పర్యటనకు ముందు ముంబైలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్లో హిట్ మ్యాన్ ప్రాక్టీస్ చేస్తూ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దాంతో సౌతాఫ్రికా పర్యటన మొత్తానికి దూరమయ్యాడు. ముందుగా టెస్ట్ సిరీస్కే అనుకున్నా.. గాయం నయమవ్వకపోవడంతో వన్డే సిరీస్ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్న హిట్మ్యాన్ ఫిట్నెస్పై దృష్టిసారించాడు. ఫిజియోల సూచనలతో జిమ్లో చెమటోడుస్తున్నాడు. అయితే తొడకండరాల గాయమవడం రోహిత్కు ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇదే సమస్యతో హిట్ మ్యాన్ బాధపడ్డాడు. అతను అధిక బరువు ఉండటంతోనే పదే పదే ఈ గాయానికి గురవ్వాల్సి వస్తుంది. అప్పర్ బాడీ వెయిట్ తొడలపై పడటంతో కండరాలు పట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే బరువు తగ్గాలని వైద్యులు రోహిత్కు సూచించారు. కనీసం 5-6 కిలోల బరువు తగ్గాలని చెప్పారు.
దాంతోనే ఫిజియోల పర్యవేక్షణలో హిట్ మ్యాన్ చెమటోడుస్తున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్ సందర్బంగా కూడా రోహిత్ ఇదే గాయంతో బాధపడగా.. అప్పుడే బరువు తగ్గాలని సూచించారు. అప్పుడు వైద్యుల సూచన మేరకు కొంత బరువు తగ్గిన హిట్ మ్యాన్ మళ్లీ ఇప్పుడు అదే పనిచేస్తున్నాడు.
బరువు తగ్గడం ద్వారా మోకాలిపై భారం తగ్గి త్వరగా కోలుకునేందుకు ఆస్కారం ఉంటుంది. కాగా టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, సంజూ శాంసన్ తదితరులు కూడా రిహాబిలిటేషన్ సెంటర్లో రోహిత్తో పాటు ట్రెయినింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గబ్బర్.. తమ కెప్టెన్ రోహిత్, భువీతో ఉన్న ఫొటోను సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్.. హిట్మ్యాన్ కాస్త సన్నబడినట్లు కనిపిస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గాయం కారణంగా సౌతాఫ్రికా టూర్కు దూరం కాగా.... ధావన్, భువీ శిక్షణ పూర్తైన తర్వాత వన్డే సిరీస్ నిమిత్తం సౌతాఫ్రికాకు వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా సెంచూరియన్లో మొదటి టెస్టు గెలిచిన టీమిండియా... వాండరర్స్లోనూ విజయం సాధించి సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక జనవరి 19 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది.