
బెంగళూరు: ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్ల ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు శుభవార్త అందింది. భుజగాయంతో భారత్ వేదికగా జరిగిన ఈ సీజన్ ఫస్టాఫ్ మ్యాచ్లకు దూరమైన ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ పూర్తిస్థాయిలో మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) తెలిపింది. అతను పోటీ క్రికెట్ ఆడుకోవచ్చని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్తో సహా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్నకు అతను అందుబాటులోకి వచ్చాడు. మార్చిలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అయ్యర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తూ అతను గాయపడ్డాడు.
గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. దాంతో అయ్యర్ అటు భారత జట్టుకు ఇటు ఐపీఎల్కు దూరమయ్యాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరించిన శ్రేయస్ గాయపడటంతో అతడి స్థానంలో టీమిండియా యువ కెరటం రిషభ్ పంత్ సారథ్య బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అతను తనదైన సారథ్యంతో జట్టుకు విజయాలందించి టాప్-2లో నిలబెట్టాడు.
యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి. ఈ మ్యాచ్లకు అయ్యర్ అందుబాటులో ఉండటం ఖాయమైన నేపథ్యంలో ఎవరికి పగ్గాలప్పగిస్తారో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పంత్ను కొనసాగిస్తారా? లేక అయ్యర్కే అవకాశం ఇస్తారా? అనేది చూడాలి.
గాయం నుంచి కోలుకొని మ్యాచ్ ఫిట్నెస్ సాధించడంపై అయ్యర్ ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు.'గాయం నుంచి కోలుకునేందుకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యుద్ధానికి రెడీ. ఆడటానికి సిద్ధం. ఇక రాబోయే కాలంలో బ్యాట్ మాట్లాడుతుంది'అంటూ తన ఆగమనాన్ని ఘనంగా చాటుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు శ్రేయస్ ట్వీట్ చేశాడు.
ఇక అయ్యర్ గైర్హాజరీలో టీమిండియాలోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ దుమ్ములేపాడు. అద్భుత ప్రదర్శనతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అలరించాడు. శ్రీలంక పర్యటనలోనూ విన్నింగ్ నాక్స్ ఆడాడు. దాంతో ప్రమోషన్ అందుకొని టెస్ట్ టీమ్ సెలెక్టయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ తరఫున అరంగేట్రం చేసేందుకు వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ పునరాగమనం ఉంటుందా? లేదా? అనేదానిపై సందేహాలు నెలకొన్నాయి.