ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్పై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి భారత మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్దు విజ్ఞప్తి చేశారు. 150 కోట్ల భారత ప్రజలను ట్రావిస్ హెడ్ అవమానించాడని మండిపడ్డారు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో రిషభ్ పంత్ ఔటైన తర్వాత ట్రావిస్ హెడ్ చేసుకున్న సంబరాలు వివాదాస్పదమయ్యాయి. ఓపికగా ఆడుతున్న పంత్ను పార్ట్టైమ్ బౌలర్ అయిన ట్రావిస్ హెడ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ సంతోషంలో గ్లాస్లో ఫింగర్ పెట్టి తిప్పుతున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. అయితే ఈ సంబరాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇది అసభ్యకరమైన సంజ్ఞ అని నెటిజన్లు, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం అతని వేళ్లను మంచు మీద ఉంచాలనే ఒక జోక్ను గుర్తు చేసానని చెబుతున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో స్పష్టంచేసి, దానిని వినోదభరితంగా వివరిస్తూ నవ్వులు పూయించాడు.
ఇదో అసభ్యకరమైన ప్రవర్తన అంటూ నవ్జ్యోత్ సింగ్ సిద్దూ ఎక్స్ వేదికగా ట్రావిస్ హెడ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మెల్బోర్న్ టెస్ట్లో ట్రావిస్ హెడ్ ప్రవర్తన చాలా అసభ్యకరంగా ఉంది. ఇది జెంటిల్మన్ గేమ్కు ఏ మాత్రం మంచిది కాదు. పిల్లలు, మహిళలు, కుర్రాళ్లు, పెద్దలు మ్యాచ్ చూస్తుంటారు. ఇలా ప్రవర్తించడం సరికాదు.

ఇది ఏ ఒక్కరినో అవమానించినట్లు కాదు. 150 కోట్ల భారత ప్రజలను ఇన్సల్ట్ చేయడమే. భవిష్యత్తులో ఇలా మళ్లీ చేయకుండా అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలా చేస్తేనే ఎవరూ కూడా ఈ సంబరాలను అనుకరించరు.'అని బీసీసీఐ, ఐసీసీలకు ట్యాగ్ చేస్తూ నవ్జ్యోత్ సింగ్ సిద్దూ ట్వీట్ చేశారు. ఐసీసీ ఛైర్మెన్గా జై షా ఉన్న నేపథ్యంలో ట్రావిస్ హెడ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది అసభ్యకరమైన సంజ్ఙ అని మండిపడుతున్నారు.