టీ20 ప్రపంచకప్ 2024లో హై ఓల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మరో 24 గంటల్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ బిగ్ మ్యాచ్కు తెరలేవనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్పై సోషల్ మీడియా వేదికగా చాలా హైప్ క్రియేట్ అయ్యింది.
పసికూన చేతిలో ఓడిన పాకిస్థాన్ ఏమేరకు భారత్కు పోటీనిస్తుందో? అని ఆ దేశ అభిమానులు ఆందోళనకు గురవుతుంటే.. ఐర్లాండ్పై విజయంతో టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. దాయాదుల పోరును ఇరు దేశాల అభిమానులు మైదానంలో జరిగే యుద్దంగానే భావిస్తారు. గెలుపు, ఓటములను తమ దేశాల ప్రతిష్టగా పరిగణిస్తారు.

ఈ క్రమంలోనే భారత్-పాక్ మ్యాచ్కు ఇంతటి క్రేజ్. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రపంచకప్ గెలిచినట్లే..
పాకిస్థాన్పై టీమిండియా సాధించే విజయం ప్రపంచకప్ టైటిల్తో సమానమని సిక్సర్ల సిద్దూ చెప్పుకొచ్చాడు. ఏ దేశం చేతిలో ఓడినా భారత అభిమానులు పెద్దగా పట్టించుకోరని, పాకిస్థాన్ చేతిలో ఓడితే మాత్రం జీర్ణించుకోలేరని, ముఖ్యంగా ప్రపంచకప్లో ఆ జట్టుపై విజయాన్నే కోరుకుంటారని తెలిపాడు. ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్దూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'పాకిస్థాన్ చేతిలో ఓటమిని భారత అభిమానులు జీర్ణించుకోలేరు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న పోరును యుద్దంలా భావిస్తారు. ఎవరి చేతిలో ఓడినా పెద్దగా పట్టించుకోరు. కానీ పాక్ చేతిలో ఓటమిని అస్సలు ఒప్పుకోరు. పాకిస్థాన్పై విజయం సాధిస్తే ప్రపంచకప్ గెలిచినంత ఆనందపడుతారు.
ఇరు దేశాల అభిమానులు ఇలానే ఉంటారు. ఎవరూ కూడా ఓటమిని అంగీకరించరు. గతంలో కంటే ప్రస్తుతం కొంచెం పరిస్థితులు మారాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేకపోవడంతో ఇరు జట్లు తరుచుగా తలపడటం లేదు.
పాక్ కంటే బలంగా భారత్..
ఇరు జట్ల బలబలాలను పరిశీలిస్తే పాకిస్థాన్ కంటే భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. పాకిస్థాన్ వరుసగా ఇంగ్లండ్, అమెరికా చేతిలో పరాజయం పాలైంది. ఇంగ్లండ్ అంటే టెస్ట్ హోదా కలిగిన జట్టు కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పసికూన యూఎస్ఏ చేతిలో ఓటమి పాకిస్థాన్ బ్యాటింగ్ బలహీనతను బయటపెట్టింది.
ఏ జట్టు అయినా ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రదర్శనపై ఆధారపడి ఉండలేదు. మరోవైపు టీమిండియా సమతూకంగా కనిపిస్తోంది.'అని నవ్జ్యోత్ సింగ్ సిద్దు చెప్పుకొచ్చాడు.
భారత్దే పై చేయి..
టీ20 ప్రపంచకప్ల్లో భారత్, పాక్ జట్లు ఇప్పటి వరకు 8 సార్లు తలపడ్డాయి. భారత్ ఏడు సార్లు విజయం సాధించగా... పాకిస్థాన్ ఒకే ఒక్క విజయం సాధించింది. అది కూడా యూఏఈ వేదికగా జరిగిన 2021 టీ20 ప్రపంచకప్లో గెలుపొందింది. ఈ ఓటమితో టీమిండియా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. గత టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శనతో పాకిస్థాన్ ఓటమిపాలైంది.